వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ కలుస్తాయని ఆరోపించారు కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. 9 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని.. ఇది అసమర్ధ ప్రభుత్వమన్నారు.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ కలుస్తాయని ఆరోపించారు కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో తూతూ మంత్రంగా రుణమాఫీ జరిగిందన్నారు. 9 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని.. ఇది అసమర్ధ ప్రభుత్వమన్నారు.
ఇకపోతే.. తెలంగాణపై బీజేపీ నాయకత్వం ఫోకస్ పెట్టింది. మూడు రాష్ట్రాల్లోని బీజేపీ ఎమ్మెల్యేలు రేపటి నుండి వారం రోజుల పాటు రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. తెలంగాణలో పార్టీ పరిస్థితిపై నివేదికను ఇవ్వనున్నారు. ఈ ఏడాది చివరలో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికల్లో అధికారాన్ని దక్కించుకోవాలని కమల దళం వ్యూహారచన చేస్తుంది.
ALso Read: తెలంగాణపై ఫోకస్: మూడు రాష్ట్రాల బీజేపీ ఎమ్మెల్యేల క్షేత్రస్థాయి పర్యటన ,హైకమాండ్కు నివేదిక
ఉత్తర్ ప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర నుండి ఎమ్మెల్యేలు రేపు హైద్రాబాద్ కు రానున్నారు. హైద్రాబాద్ లోని పార్టీ కార్యాలయంలో వర్క్ షాప్ ను నిర్వహించనున్నారు. ఈ వర్క్ షాపు తర్వాత ఎమ్మెల్యేలకు నియోజకవర్గాలను కేటాయించనున్నారు. తమకు కేటాయించిన నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు పర్యటిస్తారు. ఆయా నియోజకవర్గాల్లోని అన్ని మండలాల్లో ఎమ్మెల్యేలు పర్యటించి పార్టీపై క్షేత్రస్థాయి నివేదికను జాతీయ నాయకత్వానికి అందిస్తారు.
తమకు కేటాయించిన నియోజకవర్గంలోని ఒక్కో మండలంలో ఒక్కో రోజు ఎమ్మెల్యేలు పర్యటిస్తారు. అసెంబ్లీ స్థాయి కోర్ కమిటీ ముఖ్యులతో భేటీ అవుతారు. ఆయా నియోజకవర్గాల్లో ఉన్న పరిస్థితులు ఏమిటనే విషయమై చర్చించనున్నారు. ఆయా నియోజకవర్గాల్లో సోషల్ మీడియాను ప్రభావితం చేసే వ్యక్తులతో సమావేశాలు నిర్వహిస్తారు. అంతేకాదు గెలుపు ఓటములను ప్రభావితం చేసే వ్యక్తులతో డిన్నర్ సమావేశాల్లో పాల్గొంటారు.స్థానిక నేతలతో వ్యక్తిగతంగా నియోజకవర్గంలోని పార్టీ పరిస్థితులపై చర్చిస్తారు. ప్రత్యర్థి నేతలు, పార్టీల బలబలాలు, సామాజిక సమీకరణాలు తదితర అంశాలపై చర్చిస్తారు.
