పార్లమెంట్ ఎన్నికలు 2024: తెలంగాణకు అమిత్ షా, ఆ స్థానాలే టార్గెట్
పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. 2024 లో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుండి మెజారిటీ స్థానాలను దక్కించుకోవాలని ఆ పార్టీ భావిస్తుంది.
![Union Minister Amit Shah To Visit Hyderabad for Parliament elections 2024 preparation lns Union Minister Amit Shah To Visit Hyderabad for Parliament elections 2024 preparation lns](https://static-ai.asianetnews.com/images/01h5vv43s3zm1k5ezww1zfz6gg/kishan-reddy-new-jpg_363x203xt.jpg)
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంపై భారతీయ జనతా పార్టీ ఫోకస్ పెట్టింది. 2024లో జరిగే పార్లమెంట్ ఎన్నికలపై ఆ పార్టీ నాయకత్వం ఇప్పటి నుండే వ్యూహలు రచిస్తుంది. ఈ నెల 28వ తేదీన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైద్రాబాద్ కు రానున్నారు. వచ్చే ఏడాదిలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలకు దిశా నిర్ధేశం చేయనున్నారు.
2023 నవంబర్ 30వ తేదీన జరిగిన తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. అయితే బీజేపీ ఎనిమిది స్థానాల్లో విజయం సాధించింది. 19 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు రెండో స్థానంలో నిలిచారు.
2019 పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలోని నాలుగు పార్లమెంట్ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సానుకూలమైన ఫలితాలు వచ్చాయి. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో కూడ మెరుగైన ఫలితాలు వచ్చేలా ముందుకు సాగాలని ఆ పార్టీ నాయకత్వం భావిస్తుంది. ఈ దిశగా ముందుకు సాగాలని భారతీయ జనతా పార్టీ నేతలు వ్యూహలను రచిస్తున్నారు.ఇటీవలనే బీజేపీ రాష్ట్ర నాయకులు సమావేశమయ్యారు. పార్లమెంట్ ఎన్నికలపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేయనుందని ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఉత్తర తెలంగాణలో మంచి ఫలితాలను సాధించింది. దీంతో ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణ తెలంగాణపై కూడ కమల దళం ఫోకస్ చేయనుంది.
also read:తెలంగాణలో 12 ఎంపీ స్థానాలపై బీజేపీ ఫోకస్:కాంగ్రెస్కు చెక్ పెట్టేనా?
తెలంగాణలో గత ఎన్నికల్లో సికింద్రాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ ఎంపీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు.ఈ దఫా ఈ ఎన్నికల్లో ఈ నాలుగు స్థానాలతో పాటు మరో ఎనిమిది స్థానాల్లో విజయం సాధించాలని ఆ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది.పెద్దపల్లి,జహీరాబాద్, మెదక్,మల్కాజిగిరి,చేవేళ్ల,మహబూబ్ నగర్,నల్గొండ, భువనగిరి పార్లమెంట్ స్థానాలపై భారతీయ జనతా పార్టీ ఫోకస్ పెట్టింది.
also read:దక్షిణాదిపై బీజేపీ ఫోకస్: తెలంగాణలో నరేంద్ర మోడీ పోటీ, ఆ స్థానం ఏదంటే?
దక్షిణాదిపై భారతీయ జనతా పార్టీ కేంద్రీకరించింది. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీపై గత కొంత కాలంగా ఫోకస్ పెట్టింది. తెలంగాణ నుండి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కూడ పోటీ చేయాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం కోరినట్టుగా కూడ ప్రచారం సాగుతుంది. తెలంగాణ నుండి నరేంద్ర మోడీ పోటీ చేస్తే ఆ ప్రభావం దక్షిణాదిపై ఉండే అవకాశం ఉంది. దీంతో తెలంగాణలో పోటీ చేయాలని మోడీని ఆ పార్టీ నేతలు కోరారనే ప్రచారం కూడ లేకపోలేదు. ఈ విషయమై ఈ నెల 28న అమిత్ షా పర్యటనలో కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.