హైద్రాబాద్లో విషాదం: సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేస్తూ ఇద్దరు కార్మికుల మృతి
హైద్రాబాద్ ని కొండాపూర్ లోని అపార్ట్ మెంట్ లో సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేస్తుండగా వెలువడిన విష వాయువుల కారణంగా ఇద్దరు కూలీలు మృతి చెందారు. ఈ ఘటన లో మరో ఇద్దరు కూడా అస్వస్థతకు గురయ్యారు.
హైదరాబాద్: హైద్రాబాద్ నగరంలోని కొండాపూర్ గౌతమి ఎన్క్లేవ్లో విషాదం చోటు చేసుకొంది. సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేస్తూ ఇద్దరు కూలీలు ఆదివారం నాడు మృతి చెందారు. సెప్టిక్ ట్యాంక్ లోని విష వాయువుల వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకొందని స్థానికులు చెబుతున్నారు. ఈ అపార్ట్మెంట్ లో చాలా కాలంగా ఈ Septic Tank శుభ్రం చేయలేదు. దీంతో ఈ సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేసేందుకు నలుగురు కూలీలు పని కోసం వచ్చారు. అయితే సెప్టిక్ ట్యాంక్ మూత తీయగానే వెలువడిన Toxic Gas కారణంగా ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా అస్వస్థతకు గురయ్యారు.
అపార్ట్మెంట్ నిర్వాహకులు సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేయడం కోసం ఆన్ లైన్ లో ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు ఆధారంగా సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేసేందుకు కూలీలు అక్కడికి చేరుకొన్నారు. సెఫ్టక్ ట్యాంక్ మూత తీయగానే వెలువడిన విష వాయువు కారణంగా ఇద్దరు మరణించినట్టుగా స్థానికులు చెప్పారు. మరణించిన ఇద్దరు కార్మికులు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని దేవరకొండ మండలం గాజీనగర్ తండా వాసులుగా గుర్తించారు. మృతులు Hyderabad సైదాబాద్ కు సమీపంలోని కాలనీలో నివాసం ఉంటున్నారు. గతంలో కూడా హైద్రాబాద్ లోని పలు చోట్ల సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేస్తూ పలువురు మృత్యువాత పడిన ఘటనలు చోటు చేసుకొన్నాయి.
2019 జూన్ లో గుజరాత్ రాష్ట్రంలో సెప్టిక్ ట్యాంక్ లో చిక్కుకొన్న ఓ వ్యక్తిని కాపాడబోయి ఆరుగురు మరణించారు. వడోదరలోని దబోయిలో గల దర్శన్ హోటల్ లో శుభ్రం చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది. వడోదరలోని దభోయిలో గల దర్శన్ హోటల్లో సెప్టిక్ ట్యాంకును శుభ్రం చేసేందుకు నలుగురు కూలీలను పిలిపించాడు హోటల్ యజమాని. ముందుగా ఓ కూలీ ట్యాంక్ లోపలకి దిగాడు. ఐతే అతడు ఎంతకీ బయటకు రాకపోవడంతో అతడ్ని వెతికేందుకు మిగతా ముగ్గురు కూలీలు లోపలికి వెళ్లారు. వీళ్లూ తిరిగి రాకపోవడంతో హోటల్లో పనిచేసే ముగ్గురు సిబ్బంది కూడా ట్యాంకులోకి దిగారు. వెళ్లిన వారంతా తిరిగి రాకపోవడంతో హోటల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది.పోలీసులు ఎమర్జెన్సీ సిబ్బంది సాయంతో ఏడుగురు మృతదేహాలను వెలికి తీశారు. ట్యాంకులో వెలువడిన విషవాయువు పీల్చడంతో ఊపిరాడక మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన హోటల్ యజమానిని అరెస్టు చేశారు.
also read:విషాదం: సెప్టిక్ ట్యాంకులో పడి ఐదుగురు దుర్మరణం
2020 నవంబర్ మాసంలో జార్ఖండ్ రాష్ట్రంలోని దేవీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరుగురు మృతి చెందారు. లీలూ ముర్ము అనే కూలీ మొదట లోపలికి వెళ్లాడు. వెళ్లిన తర్వాత ఎలాంటి సడిలేదు. దీంతో కాంట్రాక్టర్ గోవింద్ మాంఝీ లోపలికి దిగాడు. అతను కూడా అటే వెళ్లిపోయాడు. పైన ఉన్న ఆయన ఇద్దరు కుమారులు బబ్లూ, లాలూలకు ఏం అర్థంకాక వారు కూడా లోపలికి వెళ్లి తిరిగి రాలేదు. లోపలికి వెళ్లిన నలుగురూ తిరిగి రాకపోవడంతో బ్రజేశ్ చంద్ర బుర్నావాల్, మితిలేశ్ చంద్ర బుర్నావాల్ కూడా లోపలికి దిగారు. వారు కూడా బయటికి రాలేదు. ఇది గమనించిన స్థానికులు వెంటనే అధికారులకు సమాచారం అందించారు. జేసీబీతో సెప్టిక్ ట్యాంక్ పక్కన గుంత తవ్వి వారిని బయటకు తీశారు. బయటకు తీశాక ఆ ఆరుగురినీ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే వారు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.