తెలంగాణ వచ్చింది కాబట్టి అల్కగ తెలుగు పంతులు అవుదామనుకుంటే కుదిరే ముచ్చటే లేదట. తెలుగు పంతులు కావాలన్నా ఆంగ్లంలో పరీక్ష రాయాల్సిందేనట. ఈ ముచ్చట టిఎస్పిఎస్సీ ఖరాఖండీగా చెబుతోంది. తెలుగొచ్చినంత మాత్రాన ఇంగ్లీషు రాకపోతే తెలుగు పంతులు కొలువులు ఇచ్చేదే లేదంటోంది టిఎస్పిఎస్సి. దీంతో భాషా పండిత్ అభ్యర్థులు లబోదిబోమంటున్నారు.
తెలంగాణ వచ్చిన మూడేళ్ల తర్వాత జెఎల్, డిఎల్ పోస్టులకు జూన్ 2న టిఎస్పిఎస్సీ నోటిఫికేషన్లు జారీ చేసింది. జులై 15న స్క్రీనింగ్ పరీక్షకు డేట్ ఫిక్స్ చేసింది. ఇదంతా బాగానే ఉంది కానీ... సర్వీసు కమిషన్ పెట్టిన ఒక నిబంధన భాషా పండితుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. తెలుగు, హిందీ పండిట్ అయినా వారు ఆంగ్లంలో పరీక్ష రాసి నెగ్గిన తర్వాతే కొలువు అని చెబుతున్నది టిఎస్పిఎస్సీ.
తెలుగు పండిట్ పోస్టులకు, హింది పండిట్ పోస్టులకు దరఖాస్తు చేసినా... ప్రిలిమ్స్ ఎగ్జామ్ మాత్రం ఇంగ్లీషులోనే రాయాలని టిఎస్పిఎస్సీ నిబంధన విధించింది. మేము తెలుగు, హిందీ చెప్పుతాం.. వాటిని చదివితే చాలు కదా అని అభ్యర్థులు అంటే కుదరదని చెబుతోంది టిఎస్పిఎస్సీ.
ఈ పోస్టుల భర్తీకి రెండు దశల్లో పరీక్షలు జరపనున్నారు. తొలి దశలో ప్రిలిమ్స్ 150 మార్కులకు ఉంటుంది. ఈ పరీక్ష అన్ని సబ్టెక్టుల వారికీ ఇంగ్లీషులోనే నిర్వహిస్తారు. తెలుగు పండిట్ అయినా.. హిందీ పండిట్ అయినా మినహాయింపు లేదు. ఇందులో మెరిట్ సాధించిన వారిలో ప్రతి పోస్టుకు 15 మంది చొప్పున మెయిన్స్ కు అర్హులుగా ప్రకటిస్తారు.
తర్వాత మెయిన్స్ పరీక్ష మాత్రం తెలుగు వారికి తెలుగులో, ఇంగ్లీషు వారికి ఇంగ్లీషులో, హిందీ వారికి హిందీలో జరుపుతారు. మొత్తానికి తెలుగు పంతులు కావాలంటే... మొదటి మెట్టులోనే ఇంగ్లీషులో తడాఖా చూపాల్సిన పరిస్థితి నెలకొంది.
మరి తెలంగాణలో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇంగ్లీషు మీద అంతగా పట్టు ఉన్న దాఖలాలు లేవు. దీంతో తమకు ఇదేం పరీక్షరా బాబూ అని వారు తల పట్టుకున్నారు. కానీ కమిషన్ వారు మాత్రం వేరే వాదన వినిపిస్తున్నారు. ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు చదువు చెప్పే తెలుగు పంతుళ్లయినా... ఆంగ్లంలో కనీస అవగాహన ఉండాల్సిందేనని టిఎస్పిఎస్సీ వాదిస్తోంది.
