దిగ్విజయ్ అరెస్టుకు రంగం సిద్ధం ?
501, 505 సెక్షన్ ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు
ఏఐసీసీ జనరల్ సెక్రటెరీ, కాంగ్రెస్ పార్టీ తెలుగు రాష్ట్రాల ఇన్ చార్జీ దిగ్విజయ్ సింగ్ పై తెలంగాణ పోలీసులు తాజాగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ముస్లింలు ఐసీస్ లో చేరేలా తెలంగాణ పోలీసులు నకిలీ వెబ్ సైట్లు సృష్టించి ప్రొత్సహిస్తున్నారని దిగ్విజయ్ తన ట్విటర్ లో సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
దీనిపై టీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో దిగ్విజయ్ వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదు ను స్వీకరించిన పోలీసులు దిగ్విజయ్ పై సెక్షన్ 501, 505 ల కింద కేసు నమోదు చేశారు.
రాష్ట్ర పోలీసులపై నిరాధార ఆరోపణలు చేసినందుకు ఒక కేసు, మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఒక వర్గాన్ని తప్పుదారి పట్టించేలా వ్యవహరించినందుకు మరో కేసు, శాంతి భద్రతల విఘాతానికి కుట్రపన్నేలా ట్విట్ చేసినందుకు ఇంకో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అయితే డిగ్గీ రాజా తనపై వస్తున్న విమర్శలను లెక్కచేయడం లేదు. కేసును న్యాయపరంగా ఎదర్కొంటానని, ఎట్టిపరిస్థితుల్లో తెలంగాణ పోలీసులకు క్షమాపణలు చెప్పేదే లేదని ఆయన స్పష్టం చేశారు.