జీవో  111   రద్దుపై  విచారణ  చేయాలని  టీపీసీసీ చీఫ్  రేవంత్ రెడ్డి  డిమాండ్  చేశారు. ఈ విషయమై  తమ పార్టీ ఆధ్వర్యంలో నిజ నిర్ధారణ కమిటీ  వేయనున్నట్టుగా రేవంత్ రెడ్డి  తెలిపారు.

హైదరాబాద్:: మంత్రి కేటీఆర్ సన్నిహితులకు భూములు కట్టబెట్టడానికి జీవో 111 రద్దు చేశారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. సోమవారంనాడు గాంధీ భవన్ లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. జీవో 111 రద్దు పై విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజా ధనం కొల్లగొట్టేందుకు జీవో 111 రద్దు చేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. జీవో 111 రద్దు చేయడంతో జంట నగరాల్లో విధ్వంసం జరుగుతుందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. జీవో 111 రద్దు హిరోషిమాపై అణు బాంబులాంటిదన్నారు.

దావూద్ ఇబ్రహీంనైనా క్షమించొచ్చు కానీ, కేసీఆర్, కేటీఆర్ లను క్షమించలేమని ఆయన చెప్పారు. ఎక్కడెక్కడ భూములు కేటాయించారో తేలుస్తామన్నారు.జీవో 111 ను రద్దు తో లక్షల కోట్లు వెనుకేయాలని ప్రభుత్వం చూస్తుందని ఆయన ఆరోపించారు. జీవో 111 పై కోదండరెడ్డి ఆధ్వర్యంలో నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా జీవో 111 ఎత్తివేతపై పాలకులు నిర్ణయం తీసుకోలేదన్నారు. కానీ, తెలంగాణ వచ్చిన తర్వాత ఆ పరిస్థితి లేదన్నారు.కేసీఆర్ కు వంద రోజుల కౌంట్ డౌన్ మొదలైందని రేవంత్ రెడ్డి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు 88 సీట్లు వస్తాయని రేవంత్ రెడ్డి ధీమాను వ్యక్తం చేశారు. షర్మిల ఏపీకి చెందిన నేతగా రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

also read:జీవో 111 ఎత్తివేత వెనుక పెద్ద భూ కుంభకోణం: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

తెలంగాణ తెచ్చుకొంది తెలంగాణ నేతలే పరి పాలించుకోవడం కోసమని ఆయన చెప్పారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో బీఆర్ఎస్ కు కాంగ్రెస్ పార్టీ భూమిని కేటాయిచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తమ పార్టికి 5, 100 గజాల భూమి కేటాయింపు విషయమై డబ్బులు కట్టినా కూడా ప్రభుత్వం నుండి స్పందన లేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. కానీ బీఆర్ఎస్ పార్టీ 11 ఎకరాల భూమిని కేటాయించుకొందని రేవంత్ రెడ్డి తెలిపారు.