Asianet News TeluguAsianet News Telugu

సిగ్గూ,ఎగ్గూ లేని మంత్రులు ఏం సమాధానం చెబుతారు?.. కలెక్టరేట్ లో సర్పంచ్ దంపతుల ఆత్మహత్యాయత్నంపై రేవంత్ రెడ్డి

బీఆర్ఎస్ మంత్రుల మీద టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. సర్పంచ్ దంపతులు ఆత్మహత్యాయత్నానికి సిగ్గు, ఎగ్గులేని మంత్రులు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. 
 

tpcc chief revanth reddy reaction on Sarpanch couple suicide attempt in Nizamabad Collectorate - bsb
Author
First Published Jan 31, 2023, 1:29 PM IST

హైదరాబాద్ : నిజామాబాద్ కలెక్టరేట్ లో సర్పంచ్ దంపతుల ఆత్మహత్యయత్నం మీద టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘అప్పులు చేసి ఊరి అభివృద్ధికోసం పాటుపడిన పాపానికి నిజామాబాద్ జిల్లా, నందిపేట సర్పంచ్ దంపతులు చచ్చిపోవాలనుకున్నారు. కలెక్టరేట్ సాక్షిగా ఆత్మహత్యయత్నం చేశారు. హైదరాబాద్ లో ఏసీ రూముల్లో కూర్చున్న బానిస మంత్రులు.. సర్పంచ్ లకు ఒక్క రూపాయి కూడా బాకీ లేమని చెబుతున్నారు. సిగ్గూ,ఎగ్గూలేకుండా మాట్లాడే ఆ మంత్రులు దీనికి ఏం సమాధానం చెబుతారు?’ అని ప్రశ్నించారు. 

అసలేం జరిగిందంటే.. నిజామాబాద్ కలెక్టరేట్లో బిల్లులకు సంబంధించిన రికార్డుల విషయంలో వేధింపులను తట్టుకోలేక ఓ సర్పంచ్ దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన చోటుచేసుకుంది.  సోమవారం కలెక్టరేట్లో ఈ ఘటన కలకలం రేపింది. తమ బిల్లుల రికార్డులపై ఉపసర్పంచ్ సంతకం చేయడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో చుట్టుపక్కల ఉన్నవారు వీరి ప్రయత్నాన్ని గమనించి అడ్డుకున్నారు.  దీనికి సంబంధించి ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..

సాంబారు వాణి, తన భర్త తిరుపతితో సోమవారం కలెక్టరేట్ట్ కు వచ్చింది. ఆమె నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రానికి చెందిన సర్పంచి. ఆమె భర్త వార్డు సభ్యుడు. సోమవారం కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమం జరిగింది. దీనికి వీరిద్దరూ హాజరయ్యారు. ఇక్కడికి వచ్చే సమయంలోనే తిరుపతి తన వెంట సీసాలో పెట్రోల్ తెచ్చుకున్నాడు. వచ్చిన తర్వాత వీరు ఒకసారిగా సీసాలో తెచ్చుకున్న పెట్రోల్ ను భార్యపై పోసి తన మీద కూడా పోసుకొని నిప్పంటించుకోబోయాడు.

మ‌హిళ హ‌త్య: నిందితుడిని ప‌ట్టించిన పచ్చబొట్టు.. ఆర్టీసీ డ్రైవర్ అరెస్ట్

పోలీసులు వెంటనే అప్రమత్తమై.. వారి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. ఆ తర్వాత తాము చేసిన పనిమీద సర్పంచ్ దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తూ మాట్లాడారు. గ్రామంలో అభివృద్ధి పనుల కోసం తాము రెండు కోట్ల రూపాయల వరకు అప్పులు చేసి మరీ పనిచేశామని తెలిపారు. అయితే, ఈ పనులకు సంబంధించి తీసుకున్న అప్పులకు సంబంధించిన రికార్డుల మీద ఉపసర్పంచ్ సంతకం చేయడం లేదని అన్నారు.  దీనికి తోడు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కూడా తమను పట్టించుకోవడం లేదన్నారు.

సర్పంచ్ దంపతుల ఆత్మహత్యాయత్నం విషయం తెలిసిన డిపిఓ జయసుధ అక్కడికి చేరుకున్నారు. వారితో మాట్లాడారు గ్రామంలో ఇప్పటివరకు రూ.90 లక్షల పనులు చేపట్టారని..  వీటి బిల్లులు రూ.68.10 లక్షల వరకు చెల్లించామని తెలిపారు. మిగిలినవి చెల్లించాల్సి ఉందని అన్నారు. జరిగిన పనులను పరిశీలించిన తర్వాత సంతకం చేస్తానని ఉప సర్పంచ్ చెప్పాడని..  దీంతో వివాదం తలెత్తిందని చెప్పుకొచ్చారు. దీనిమీద నిజామాబాద్ రూరల్ ఎస్సై లింబాద్రి మాట్లాడుతూ.. సర్పంచ్ దంపతులపై కేసు నమోదు చేశామని తెలిపారు. దీనిమీద సీఎం కార్యాలయం నుంచి ఆరా తీసినట్లు తెలుస్తోంది.

ఉదయం జరిగిన సర్పంచ్ దంపతులు ఆత్మహత్యాయత్నం పంచాయతీ.. రాత్రికి  మరో మలుపు తీసుకుంది. ఉదయం ఉప సర్పంచ్  బిల్లులపై సంతకాలు చేయడం లేదని తెలిపిన వారు..  రాత్రి అయ్యేసరికి ‘ఎమ్మెల్యే తమను పట్టించుకోలేదని.. పార్టీలో తమకు ఎలాంటి న్యాయం జరగలేదని విలేకరులతో మాట్లాడే సమయంలో తెలిపారు. పంచాయతీ బాగు కోసం పనులు చేయించడానికి డబ్బులు ఖర్చు చేశామని.. వాటి కోసం ఇబ్బంది పడడం ఏమిటి అని ఆవేదనతోనే ఆత్మహత్య చేశామని చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని రెండు రోజుల కింద కలిసామని మా పరిస్థితి తెలిపి బకాయి బిల్లులు ఇప్పించమని అడిగామని.. అన్నారు. వాటిని ఇప్పిస్తానని హామీ ఇచ్చినట్లుగా తెలిపారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios