టీపీసీసీ చీఫ్ పదవి: రేవంత్ రెడ్డిదే పైచేయి, ఢిల్లీకి కోమటిరెడ్డి
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంగళవారం నాడు ఢిల్లీకి వెళ్లారు. టీపీసీసీ చీఫ్ పదవికి పార్టీ నాయకత్వం ఖరారు చేసే అవకావశం ఉందనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఢిల్లీ పర్యటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది.
హైదరాబాద్: భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంగళవారం నాడు ఢిల్లీకి వెళ్లారు. టీపీసీసీ చీఫ్ పదవికి పార్టీ నాయకత్వం ఖరారు చేసే అవకావశం ఉందనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఢిల్లీ పర్యటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది.
టీపీసీసీ చీఫ్ రేసులో మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పేర్లు ప్రధానంగా విన్పిస్తున్నాయి.
టీపీసీసీ చీఫ్ పదవి కోసం రాష్ట్రంలోని పార్టీ నేతల నుండి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మాణికం ఠాగూర్ ఇటీవల అభిప్రాయాలను సేకరించారు. పార్టీ నేతల అభిప్రాయం మేరకు ఠాగూర్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కు నివేదికను అందించారు.
మరో వైపు ఇదే విషయమై ఎఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి సమర్పించారు. ఈ నెల 16వ తేదీన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలిశారు. రాహుల్ గాంధీతో కూడ భేటీ అయ్యారు.
టీపీపీసీ చీఫ్ పదవికి నేత ఎంపిక దాదాపుగా పూర్తైందనే ప్రచారం నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకొంది.
రేవంత్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ పదవిని ఇవ్వాలని మెజారిటీ నేతలు చెప్పారని ప్రచారం సాగుతోంది. సీనియర్లలో కొందరు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవిని ఇవ్వాలని కోరినట్టుగా సమాచారం. రెడ్డియేతర సామాజిక వర్గానికి టీపీసీసీ చీఫ్ పదవిని ఇవ్వాలంటే సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క పేరును అధిష్టానం పరిశీలిస్తోందని సమాచారం.
తెలంగాణ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడానికి మాస్ ఫాలోయింగ్ ఉన్న నేతకు టీపీసీసీ చీఫ్ పదవిని అప్పగించాలని పార్టీ అధిష్టానం భావిస్తోందనే ప్రచారం సాగుతోంది.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మంత్రి పదవికి రాజీనామా చేయడంతో పాటు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం తాను చేసిన కృషిని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పార్టీ నాయకత్వానికి ఇప్పటికే వివరించారు.
also read:టీపీసీసీ చీఫ్ పదవి: హైకమాండ్ వద్ద నేతల లాబీయింగ్
తనకు పీసీసీ చీఫ్ పదవిని అప్పగిస్తే పార్టీని బలోపేతం చేసి రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొస్తానని ఆయన పలుమార్లు గతంలో ప్రకటించారు. ఇదే విషయాన్ని మరోసారి పార్టీ అధిష్టానానికి చెప్పే అవకాశం ఉందని సమాచారం.
also read:పీసీసీకి కొత్త చీఫ్: సీనియర్ల ఢిల్లీ టూర్ వెనుక ఉద్దేశ్యమదేనా?
ఈ నెల 23వ తేదీన లేదా 26వ తేదీన టీపీసీసీ చీఫ్ పదవిని ప్రకటించే అవకాశం ఉంది. ఈ నెల 23వ తేదీన ప్రకటించకపోతే ఈ నెల 26వ తేదీన పీసీసీకి కొత్త చీఫ్ ను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.