అంతా ఏకమయ్యారు...జై
నయీం ఎన్ కౌంటర్ తర్వాత రెన్నెళ్ల పాటు పత్రికలు ప్రతి పేజీని నయిూంకు అంకితం చేసి, అతగాడెంత దుర్మార్గుడో, ఎందరు నేతలకు మిత్రుడో రాశాయి. ఇపుడదంతా ఉత్తదే...జోక్ అనుకోవాలా?
రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం రావడం జరగదు. వస్తే వాటి ఉనికి కి ముప్పు వస్తుంది. అందుకే ప్రతిపార్టీ మరొక పార్టీ కంటే భిన్నం అని చెప్పుకునేందుకు అపుడపుడు విమర్శించుకోవడం, తిట్టుకోవడం, కొట్టుకోవడం జరగుతూ ఉంటుంది. దీనినే మనం రాజకీయాలు అని చెప్పుకుంటుంటా. సోషలిజం కోసం బతుకున్న కమ్యూనిస్టుల మధ్య కూడా సయోధ్య లేకపోవడానికి కారణం కూడా ఇదే.
అయితే, తెలంగాణాలో ఇపుడు రాజకీయ నాయకుల మధ్య ఒక చారిత్రాత్మక ఏకాభిప్రాయం (The Great Telangana Consensus) కుదిరినట్లుంది. ఇది బంగారు తెలంగాణాకో, నవతెలంగాణాకో, నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కాకుండా, కేసుల వివాదంలో కుదరడం విశేషం.సిబిఐ విచారణకు వ్యతిరేకంగా జరగడం మరొక విశేషం.
హంతకుడు నయీంను ఎన్ కౌంటర్ చేశాక, ప్రపంచంలోనే అతి భయంకరమయిన క్రూరుడిగా చిత్రించేందుకు అన్ని ప్రయత్నాలు జరిగాయి. వేలకోట్లఆస్తులన్నారు. పిల్లలను కూడా లైంగిక వాంఛలకు వాడుకున్నారన్నారు. ఎంత కిరాతంగా చంపేవాడో రాశారు. అన్ని రాజకీయ పార్టీల నాయకుల పేర్లువినిపించారు.పోలీసు అధికారులను, ఐఎ ఎస్ అధికారులను ఉదహరించారు. వచ్చిన పేర్ల కంటే రాకుండా అడ్డుకున్నపేర్లే ఎక్కువని కొందరు చెబుతారు. దానికి సాక్షాలు లేవు. ఎంతో మందిశాసన సభ్యుల పేర్లతో నయీం కు సంబంధాలున్నాయని వార్తలొచ్చాయి. వాళ్లంతా గజగజ వణికి పోయి, ప్రభుత్వం శరణుజొచ్చారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో, ఇంత ఆస్తి, రాజకీయ కనెక్షన్లున్నపుడు సిబిఐ విచారణకు ఆదేశించండని సిపి ఐ నాయకుడు నారాయణ కోర్టుల కేసు వేశారు.
ఈ మధ్యలో ఏమిజరిగిందో ఏమో, పేజీలకు పేజీలు నయీం ఘోరాలు నేరాలు రాయించిన వాళ్లే ఇపుడసలు నయీంతో ఏ రాజకీయనాయకుడికి సంబంధంలేదు అని చెబుతున్నారు. అంతేకాదు,పోలీసు అధికారుకుల కూడా సంబంధం లేదని అంటున్నారు.
నయీం డైరీ దొరికిందన్నాారు.కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి దానిని బయటపెట్టండని డిమాండ్ చేశారు. నయీం పేరు అసెంబ్లీని అట్టుడికించింది. గత ప్రభుత్వాలు పెంచిపోషించిన రాక్షుసుడు అని సభలో హరీష్ రావు అభయమిచ్చాడు. తర్వాత వివరాలు వెల్లడిస్తామన్నారు. ఏదీ జరగలేదు.
దీనిని బట్టి రాష్ట్ర రాజకీయ ప్రయోజనలా రీత్యా అంతా ఒక అంగీకారానికి వచ్చి,అబ్బే మనకెవ్వరికీ సంబంధలేదుని చప్పట్లు కొట్టుకున్నట్లున్నారు.
ఈ వార్త మీద ఏ పార్టీ ఖండన జారీచేసినట్లు లేదు. వివరణ కోరినట్లు లేదు. ఏకాభిప్రాయం కుదిరందనడానికి ఇదొక సూచన.అధికారపక్షం, ప్రతిపక్షం అని తేడా లేకుండా, పోలీస్ పైఅధికారులు, కిందోళ్లు అనే తారతమ్యం లేకుండా అందరిని సంతృప్తి పరిచిన నయాంకు ఇంతకంటే సమిష్టి నివాళి ఏముంటుంది.
దీనిని ది గ్రేట్ తెలంగాణా కాన్సెన్సస్ గా చెప్పుకో వచ్చా?
అసలు నయీం అనేవాడే లేడు, అదొక మీడియా సృష్టి, పోలీస్ కాల్పుల్లో చనిపోయింది ఎవడో వీధి రౌడీ అనే ప్రకటన వస్తుందేమో చూడాలి.