తమ డిమాండ్లపై తెలంగాణ రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో జరిగిన చర్చల అనంతరం, తెలంగాణ రాష్ట్ర రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ (TGSRTC) కార్మికులు మే 6 మంగళవారం తమ సమ్మెను విరమించారు. హైదరాబాద్‌లోని మంత్రివాసంలో జరిగిన చర్చల తర్వాత, ప్రభుత్వం హామీ ఇవ్వడంతో కార్మిక సంఘాలు సమ్మె విరమించనున్నట్లు ప్రకటించాయి. 

కార్మికుల సమస్యలపై అధ్యయనం చేయడానికి రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ నవీన్ మిట్టల్ నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ త్వరలో సమగ్ర నివేదిక సమర్పించనుంది. మీడియాతో మాట్లాడిన యూనియన్‌ నాయకులు, “ప్రభుత్వం హామీ ఇచ్చిన నేపథ్యంలో సమ్మెను నిలిపివేస్తున్నాం. అయితే, వాగ్దానం నెరవేరకపోతే మళ్లీ పెద్ద ఎత్తున ఉద్యమానికి దిగుతాం,” అని స్పష్టం చేశారు.

ఈ చర్చలలో దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్‌రెడ్డి, కొత్తగూడెం ఎమ్మెల్యే కునంనేని సంబశివరావు, పరిజీ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ కోదండరాం, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

Scroll to load tweet…

 

కార్మికుల ప్రధాన డిమాండ్లు ఇవే:

RTCని ప్రభుత్వంలో విలీనం చేయాలి

2021, 2025 పే స్కేల్స్ అమలు

పెండింగ్ బకాయిల చెల్లింపు

యూనియన్ ఎన్నికలకు అనుమతి ఇవ్వాలి

 TGSRTC మేనేజ్‌మెంట్ హెచ్చరిక:

ఇదిలా ఉంటే అంతకు ముందు TGSRTC మేనేజ్‌మెంట్ ఓ బహిరంగ లేఖ విడుదల చేస్తూ, కార్మికులు వెంటనే విధుల్లో చేరకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ESMA చట్టం ప్రకారం సమ్మెలు నిషేధించిన నేపథ్యంలో  ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని పేర్కొంది. 

“2019 సమ్మె వల్ల సంస్థ తీవ్ర నష్టాలు చవిచూసింది. ఇప్పుడే నిలకడకు వస్తోంది. దయచేసి ఓ నిరుద్దేశమైన వర్గం మాటలు నమ్మి సంస్థను మళ్లీ నష్టాల్లోకి నెట్టవద్దు,” అని కార్మికులకు పిలుపునిచ్చింది.