Telangana: ఇండియన్ ఆర్మీకి అండగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..

Synopsis
భారత్, పాకిస్థాన్ల మద్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. పాకిస్థాన్లోని ఉగ్రవాద శిబిరాలపై ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది. పాకిస్థాన్ దాడులను భారత ఆర్మీ ధీటుగా ఎదురుకుంటోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
పాకిస్థాన్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ విజయవంతంగా కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఆపరేషన్ విజయానికి మద్దతుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ ఒక నెల వేతనాన్ని నేషనల్ డిఫెన్స్ ఫండ్కు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కాంగ్రెస్ శాసన సభ్యులతో చర్చించి ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నారు. ఇతర పార్టీల ప్రజాప్రతినిధులు కూడా ఈ తరహా విరాళాలకు ముందుకు రావాలని కాంగ్రెస్ పిలుపునిచ్చింది.
ఈ విషయాన్ని వెల్లడిస్తూ సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. "నేను భారతీయుడిగా ముందు ఉండాలని నమ్ముతాను. మా దేశ సైనిక దళాలు ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు, సరిహద్దులను, ప్రజలను రక్షించేందుకు చేస్తున్న అద్భుతమైన సేవలకు నేను ఒక నెల వేతనాన్ని నేషనల్ డిఫెన్స్ ఫండ్కు వినయపూర్వకంగా విరాళంగా ఇస్తున్నాను. నా సహచరులు, పార్టీ సహోద్యోగులు, మంచి మనసున్న పౌరులందరూ ముందుకు రావాలని కోరుతున్నాను. విజయం సాధించే వరకు మన దళాలకు అండగా నిలుద్దాం అంటూ రాసుకొచ్చారు.
ఆలయాల్లో ప్రత్యేక పూజలు:
భారత ఆర్మీకి మానసిక మద్దతుగా, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావాలని రాష్ట్రంలోని ప్రతి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించాల్సిందిగా ఆమె సూచించారు. ఉగ్రవాదులను నాశనం చేయడంలో భారత ఆర్మీ చూపుతున్న ధైర్యం, సంకల్పాన్ని ప్రశంసిస్తూ, దేశం అంతా ఏకతాటిపై నిలవాల్సిన అవసరం ఉందని అన్నారు.