Hyderabad: అకాల వర్షాల తర్వాత, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఎండలు దంచికొడుతున్నాయి. కొన్ని జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 45 డిగ్రీల సెల్సియస్కు చేరుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ నివేదికలు పేర్కొంటున్నాయి.
Hyderabad gears up for summer heat: ఇటీవల కురిసిన అకాల వర్షాల తర్వాత రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగాయి. రానున్న రోజుల్లో ఎండలు మండిపోనున్నాయని వాతావరణ నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ వారంలో నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇదే సమయంలో తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఇందులో ఆదిలాబాద్, జగిత్యాల, కొమరం భీం, మంచిర్యాల, నిర్మల్, రాజన్న సిరిసిల్ల జిల్లాలు ఉన్నాయి.
హైదరాబాద్ లో అకాల వర్షాలు.. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
ఇటీవల హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షాలు వేసవి తాపంతో అల్లాడుతున్న నగరవాసులకు ఉపశమనం కలిగించాయి. అయితే, ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకోవడంతో మళ్లీ ఉష్ణోగ్రతలు పెరుగుతున్న పరిస్థితులు ఉన్నాయని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. హైదరాబాద్ లోని చార్మినార్, ఖైరతాబాద్, కూకట్ పల్లి, ఎల్బీనగర్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లి జోన్లలో సోమవారం సాయంత్రం, రాత్రి వర్షం కురిసింది. అయితే, హైదరాబాద్ లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ కు చేరే అవకాశం ఉన్నందున మార్చి 31 వరకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 36 నుంచి 40 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ (టీఎస్డీపీఎస్) అంచనా వేసింది. హైదరాబాద్ లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 34 డిగ్రీల నుంచి 37 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు 22 డిగ్రీల నుంచి 24 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉంది.
సమ్మర్ సీజన్ లో హైడ్రేట్ గా ఉండటానికి సెహ్రీ చిట్కాలు
రాష్ట్రంలో క్రమంగా పెరుగుతున్న ఎండల ప్రభావం దృష్ట్యా హైదరాబాద్ ప్రాంతీయ వాతావరణ విభాగం (ఐఎండీ), టీఎస్డీపీఎస్ పలు కీలక సూచనలు చేస్తూ.. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, తదనుగుణంగా ప్రణాళికలు వేసుకోవాలని సూచించాయి. రంజాన్ మాసంలో వేసవి తాపం పెరుగుతుండటంతో సెహ్రీ సమయంలో తగినంత నీరు తాగడం చాలా అవసరమని తెలిపాయి. వివిధ అధ్యయనాల ప్రకారం, ఉపవాసం సమయంలో ఒక వ్యక్తి రోజంతా హైడ్రేట్ గా ఉండటానికి కనీసం 60 ఔన్సులు లేదా దాదాపు 2 లీటర్లకు పైగా నీరు సహాయపడుతుంది.
సెహ్రీ భోజనం చివరలో పెరుగు తినడం శాస్త్రీయంగా సరైనదనీ, ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఎందుకంటే ఇది కడుపును ఉపశమనం చేయడానికి.. ఆమ్లతను నివారించడానికి సహాయపడుతుంది, చివరికి నిర్జలీకరణానికి గురికాకుండా నిరోధిస్తుంది. హైడ్రేటెడ్ గా ఉండటానికి, భోజనంలో మసాలా, ఉప్పు, చక్కెరలు తక్కువగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే, దోసకాయ, టమోటా సలాడ్ వంటి నీరు అధికంగా ఉండే ఆహారాలతో పాటు పుచ్చకాయ, నారింజ, కివి వంటి పండ్లను సెహ్రీ భోజనంలో భాగం చేసుకోవాలని చెబుతున్నారు. ఇది కాకుండా, వదులుగా, లేత రంగు కాటన్ దుస్తులను ధరించడం కూడా వేడిని ఎదుర్కోవడంలో సహాయపడుతుందన్నారు.
