తెలంగాణ రాజ‌కీయాల్లో పోన్ ట్యాపింగ్ కేసు ఎంత‌టి చ‌ర్చ‌కు దారి తీసిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో ప్ర‌తిప‌క్ష నేత‌ల ఫోన్‌ల‌ను ట్యాపింగ్ చేశార‌న్న ఆరోప‌ణ‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే.

త్వ‌ర‌లోనే భార‌త్‌కి ప్ర‌భాక‌ర్ రావు

తెలంగాణలో రాజకీయ సంచలనం రేపిన ఫోన్‌ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ ఎస్‌ఐబీ (స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్) ఓఎస్డీ ప్రభాకర్ రావు త్వరలో భారత్‌కి తిరిగివస్తున్న‌ట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆయన జూన్ 5వ తేదీన విచారణకు హాజరవుతానని దర్యాప్తు బృందానికి తెలియజేశారు.

అస‌లేం జ‌రిగిందంటే

వివరాల్లోకి వెళితే... ఫోన్‌ ట్యాపింగ్ కేసు వెలుగులోకి వచ్చిన వెంటనే ప్రభాకర్‌ రావు దేశం విడిచి వెళ్లిపోయారు. గత 14 నెలలుగా ఆయన అమెరికాలో ఉన్నారు. తాజాగా, సుప్రీంకోర్టులో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది. ఈ సందర్భంగా విచారణకు పూర్తి స్థాయిలో సహకరించాల‌ని, మూడు రోజుల్లో భారత్‌కి రావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అండర్‌టేకింగ్ లేఖను సమర్పించాలని ఆదేశించి. దీనిపై స్పందించిన ప్రభాకర్, వన్ టైమ్ ఎంట్రీ పాస్‌పోర్టు అందగానే భారత్‌కు వస్తానని పేర్కొన్నారు.

మూడు రోజుల్లో భార‌త్‌కు రావాల‌ని ఆదేశం

ఈ నేపథ్యంలో ఆయనకు పాస్‌పోర్టు అందిన వెంటనే మూడు రోజుల్లో భారత్‌కు రావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే, ఈ దశలో ఆయనపై ప్రభుత్వం గట్టిగా ఎలాంటి చర్యలు తీసుకోకూడదని కూడా సూచించింది. ముందస్తు బెయిల్ విషయంలో తదుపరి విచారణను కోర్టు చేపట్టనుంది.

మ‌రింత స్ప‌ష్ట‌త వ‌చ్చే అవకాశం

ప్రభాకర్ రావు భారత్‌కు వస్తున్న నేపథ్యంలో, దర్యాప్తు బృందం ఆయనను విచారించేందుకు సిద్ధమవుతోంది. ఆయన నుంచి లభించే సమాచారం ద్వారా ఫోన్‌ ట్యాపింగ్ వ్యవహారంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీల‌క క‌ద‌లిక‌తో ఏం జ‌ర‌గ‌నుంద‌న్న అంశం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.