Asianet News TeluguAsianet News Telugu

మునుగోడులో 200 కార్లు, 2 వేల మోటారు బైక్ లు బీజేపీ బుక్ చేసింది: హరీష్ రావు సంచలనం

మునుగోడులో  నేతలకు  200 కార్లు, 2 వేల మోటార్ బైక్ లను బీజేపీ బుక్ చేసిందని తెలంగాణ మంత్రి హరీష్  రావు చెప్పారు. ఈ కార్లు, బైక్ లు ఎవరికిచ్చారో  సమాచారం సేకరించి ఈసీకి ఫిర్యాదు చేస్తామన్నారు.
 

 Telangana Minister Harish Rao reacts on  BJP Telangana Chief Bandi Sanjay
Author
First Published Oct 9, 2022, 1:45 PM IST

హైదరాబాద్: మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో కోట్లు పెట్టి ప్రజలను కొనాలని బీజేపీ ప్రయత్నిస్తుందని  తెలంగాణ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. ఆదివారం నాడు ఆయన  హైద్రాబాద్ టీఆర్ఎస్  శాసనసభపక్ష కార్యాలయంలో  మీడియాతో మాట్లాడారు.  200 బ్రీజా కార్లు, 2 వేల మోటార్ బైక్ లను బీజేపీ బుక్ చేసిందని తమకు సమాచారం అందిందని హరీష్ రావు చెప్పారు. ఎవవరికి బ్రీజా కార్లు, మోటార్ బైక్ లు వచ్చాయో తాము కూడ సమాచారాన్ని సేకరిస్తున్నామని  మంత్రి హరీష్ రావు చెప్పారు. ఈ సమాచారం ఆధారంగా ఈసీకి, పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హరీష్ రావు  చెప్పారు.

మునుగోడు ప్రజల ఆత్మగౌరవానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధనానికి మధ్య పోటీ జరుగుతుందన్నారు  మంత్రి హరీష్  రావు.  వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడితే తప్పేమిటని  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటీవలే వ్యాఖ్యానించారని  మంత్రి హరీష్ రావు  గుర్తు చేశారు. ఎన్నికల సందర్భంగా మోటార్లు (కార్లు, బైక్ లు) ఇచ్చి  వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తారని ఆయన  ఆరోపించారు..

మునుగోడులో దొడ్డిదారిన గెలిచేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తుందని హరీష్ రావు విమర్శించారు. సంక్షేమం, అభివృద్దిలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందని మంత్రి హరీష్  రావు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్మిందన్నారు. లాభాల్లో నడుస్తున్న కీలకమైన ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం కారు చౌకగా ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టిందని ఆయన విమర్శించారు. కేంద్రం ఒక్క మంచి పనైనా  చేసిందా అని హరీష్ రావు విమర్శించారు.బీజేపీ దిక్కుమాలిన రాజకీయాలు చేస్తుందని ఆయన మండిపడ్డారు. 

 కేసీఆర్ క్షుద్రపూజలు చేస్తున్నారని బీజేపీ తెలంగాణచీఫ్ బండి సంజయ్ చేసిన విమర్శలపై మంత్రి హరీష్ రావు స్పందించారు. వారణాసి హిందూ యూనివర్శిటీలో బూత వైద్యం కోర్సులు ప్రారంభించిన ఘనత బీజేపీదేనన్నారు.   

మంత్రతంత్రాలు,మత కల్లోలాలు, బూత వైద్యం కోర్సులు  ప్రారంభించిన చరిత్ర మీదేనని ఆయన బీజేపీ పై మండిపడ్డారు.చేతబడులు ఎలా చేయాలో కోర్సులు పెట్టి నేర్పిస్తున్న మీరే మాపై ఆరోపణలు చేయడం  దొంగే దొంగ అన్నట్టుగా ఉందన్నారు. ఈ కోర్సును నేర్చుకోవాలని బండి సంజయ్ కు మంత్రి హరీష్ రావు  సలహ ఇచ్చారు.  తాము క్షుద్ర పూజలు చేసినట్టుగా  ఆధారాలు బయటపెట్టాలని  హరీష్ రావు డిమాండ్ చేశారు. 

8 ఏళ్లుగా దేశంలో తాము చేసిన  గొప్ప కార్యక్రమం ఏమీ లేనందున  మునుగోడులో ఓటమి ఖాయమనే   భయంతో బీజేపీ నేతలు మాట్లాడుతున్నారన్నారు.  తమ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు గొప్పగా ఉన్నాయని ప్రశంసిస్తూ అవార్డులు ఇచ్చిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.  తెలంగాణ రాష్ట్రం అమలు చేసిన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ,రైతు బంథు వంటి పథకాలను కేంద్రం కాపీ కొట్టిందని ఆయన విమర్శించారు. 

also read:మునుగోడు బైపోల్2022: కొయ్యలగూడెం నుండి నారాయణపురం వరకు రేవంత్ రోడ్ షో

.ఎనిమిదేళ్లలో భర్తీ చేసిన ఉద్యోగాల పై తాము శ్వేత పత్రం ప్రకటిస్తామన్నారు. కేంద్ర ఉద్యోగాల పై మీరు ప్రకటిస్తారా అని  మంత్రి హరీష్ రావు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ను ప్రశ్నించారు. తప్పుడు ప్రకటనలు చేసి బీజేపీ తెలంగాణ ప్రజల మనసు గెలవలేదని  హరీష్ రావు చెప్పారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios