Telangana man shot dead in US: అమెరికాలో ఘోర సంఘటన జరిగింది. తెలంగాణకు చెందిన ఓ యువ టెకీని అక్కడి పోలీసులు కాల్చేశారు. తీవ్రంగా గాయ‌ప‌డిన యువ‌కుడు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే.? 

అమెరికాలో జరిగిన ఘోర ఘటనలో మహబూబ్‌నగర్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మోహమ్మద్ నిజాముద్దీన్ (30) పోలీసుల కాల్పుల్లో మృతి చెందాడు. ఈ సంఘటన సెప్టెంబర్ 3న కాలిఫోర్నియా రాష్ట్రం సాంటా క్లారాలోని అతని నివాసంలో జరిగింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

అసలేం జరిగిందంటే.?

నిజాముద్దీన్ తన రూమ్‌మేట్‌తో జరిగిన వాగ్వాదం గొడవకు దారి తీసింది. కుటుంబ సభ్యులు, స్థానిక మీడియా ప్రకారం ఏసీ విషయంలో ప్రారంభమైన వాగ్వాదం కత్తులతో దాడుల వరకు వెళ్లింది. ఈ సమయంలో రూమ్‌మేట్ గాయపడగా, సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు.

సాంటా క్లారా పోలీస్ డిపార్ట్‌మెంట్ ప్రకారం, పోలీసులు గదిలోకి వెళ్లినప్పుడు ఒకరు చేతులు పైకెత్తగా, మరొకరు అలా చేయలేదు. ఆ తర్వాత జరిగిన కాల్పుల్లో నిజాముద్దీన్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో మృతి చెందాడు. గాయపడిన రూమ్‌మేట్ ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు.

కుటుంబం ఏమంటోంది?

నిజాముద్దీన్ తండ్రి మోహమ్మద్ హస్నుద్దీన్ గురువారం (సెప్టెంబర్ 18) ఉదయం ఈ విషయం తెలిసిందని చెప్పారు. “నా కుమారుడిని పోలీసులు ఎందుకు కాల్చారో స్పష్టత లేదు. మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు కేంద్రం సహాయం చేయాలి” అని ఆయన విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌కు లేఖ రాశారు.

ప్రభుత్వ సహాయం కోరుతూ

ఎంబిటి నాయకుడు అంయాద్ ఉల్లా ఖాన్ ఈ లేఖను సోషల్ మీడియాలో ఈ విష‌యాన్ని షేర్ చేశారు. కేంద్రం జోక్యం చేసుకుని కుటుంబానికి సహాయం చేయాలని కోరారు. మృతదేహాన్ని మహబూబ్‌నగర్‌కు తీసుకురావడానికి వాషింగ్టన్ డీసీలోని భారత రాయబార కార్యాలయం, శాన్‌ఫ్రాన్సిస్కో కాన్సులేట్ సహాయం చేయాలని కుటుంబం విజ్ఞప్తి చేసింది.

Scroll to load tweet…

కొనసాగుతోన్న విచారణ 

సాంటా క్లారా పోలీస్ డిపార్ట్‌మెంట్, కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసు ఇంకా విచారణలోనే ఉందని, త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.