ఇప్పుడు తల్లిగారిల్లు కాదు.. అత్తగారింటికి మారింది
- వైద్య ఆరోగ్య శాఖ పథకంపై మంత్రి లక్ష్మారెడ్డి ఆసక్తికరమైన ముచ్చట
- శాసనమండలిలో జరిగిన చర్చలో మంత్రి సమాధానం
శాసనమండలిలో జరిగిన చర్చకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏ విషయంలో ఏం వ్యాఖ్యలు చేశారో ఈ కింద వార్త చదవండి.
కెసిఆర్ కిట్ల పథకంలో కేవలం కిట్లను మాత్రమే చూడొద్దని, ఆ పథకం అమలులో ఉన్న సీఎం కెసిఆర్ విజన్ని, ముందు చూపుని చూడాలని ప్రతిపక్షాలకు సూచించారు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి. భవిష్యత్తులో ఆరోగ్య సమాజాన్ని నిర్మించాలనే లక్ష్యం, తద్వారా ఆరోగ్య తెలంగాణను నిర్మించాలనే సిఎం కెసిఆర్ దార్శనికత దాగుందని మంత్రి అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బుధవారం శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో ప్రతిపక్షల సభ్యురాలు ఆకుల లలిత అడిగిన ప్రశ్నకు మంత్రి లక్ష్మారెడ్డి సవివరమైన సమాధానం ఇచ్చారు.
గర్బిణీలను మూడో నెలలోనే గుర్తించడం, గుర్తించిన రోజు నుంచే వారికి పూర్తి ఉచితంగా ప్రభుత్వ వైద్యశాలల్లో పూర్తి ఉచితంగా పరీక్షలు చేంయించి, మందులు ఇప్పించడం, అవసరమైన స్కానింగ్లు చేసి, వారి ఆరోగ్యస్థితిగతులు తెలియచేస్తూ, ఎక్స్పెక్టెడ్ డెఇలివరీ డేట్ని ఇస్తూనే, సహజ ప్రసవాలను ప్రోత్సహించడం జరుగుతున్నదన్నారు. ఒకవేళ క్రిటికల్ కండీషన్ ఉంటే వారిని ఆ సదుపాయాలున్న చోట్లకి పంపిస్తున్నామన్నారు. పుట్టిన బిడ్డకు కూడా టీకాలు ఇచ్చి, కెసిఆర్ కిట్లు ఇచ్చి, నాలుగు విడతలుగా మగపిల్లవాడు పుడితే రూ.12వేలు, ఆడ పిల్ల పుడితే అదనంగా వెయ్యి ఇస్తూ రూ.13వేలు అందచేస్తున్నామన్నారు. ఈ కారణంగా ప్రభుత్వ దవాఖానాల్లో 30శాతంగా ఉన్న ప్రసవాలు 55శాతానికి చేరాయన్నారు. సిజేరియన్లు తగ్గాయన్నారు.
20 ఏళ్ళుగా నిర్లక్ష్యం చేసిన నియామకాలను తమ ప్రభుత్వం చేపట్టిందన్నారు. కొత్తగా 4వేల పోస్టులను భర్తీ చేయడానికి సీఎం కెసిఆర్ అనుమతిచ్చారని వివరించారు. అలాగే కొత్తగా మాతా శిశు ఆరోగ్య కేంద్రాలను నిర్మిస్తున్నామన్నారు. ఆయా వైద్యశాలల్లో ఉద్యోగాల భర్తీని కలెక్టర్లకు అప్పగించామని చెప్పారు. ఒకప్పుడు నిరుపేదలకే పరిమితమైన వైద్యశాలలు కెసిఆర్ కిట్ల పథకంతో ధనవంతులకు కూడా ఉపయోగపడుతున్నాయన్నారు. ఆడవాళ్ళ ఆత్మగౌరవాన్ని పెంచుతున్నామని, తల్లిగారింట్ల జరిగే కాన్పులు ఇప్పుడు అత్తవారిండ్లల్లోనే జరుగుతున్నాయని చెప్పారు. కూలీ పనులు చేసుకునే నిరుపేద మహిళలకు ఆర్థిక సాయం ద్వారా కెసిఆర్ ఆ కుటుంబాలకు పెద్దన్నగా నిలిచారన్నారు. కెసిఆర్ కిట్లు కూడా నాణ్యంగా ఉన్నాయని, అందులోని వస్తువులు కూడా బ్రాండెడ్వే నని మంత్రి లక్ష్మారెడ్డి వివరించారు.
కోదండరాం తో చేతులు కలిపిన టిడిపి తమ్ముళ్లు
ఈ వీడియో తోపాటు మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి