ప్రైవేట్ ఆసుపత్రులను కట్టడి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కొత్త చట్టం తీసుకొస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అసెంబ్లీలో ప్రకటించారు. 

తెలంగాణలో ప్రైవేట్ ఆసుపత్రుల నియంత్రణకు కొత్త చట్టం తెస్తామన్నారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు. శనివారం ఆసెంబ్లీలో ఆయన ప్రసంగిస్తూ.. ప్రైవేట్ ఆసుపత్రులపై ఇప్పటి వరకు నియంత్రణ లేదన్నారు. అందుకే కొత్త చట్టం తెస్తామని హరీశ్ రావు తెలిపారు. పేద ప్రజలకు కార్పోరేట్ వైద్యం అందించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన వెల్లడించారు. జిల్లాకొక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తున్నామని.. దీని వల్ల ప్రొఫెసర్లు, 650 పడకల ఆసుపత్రి వస్తుందని , ఆపరేషన్ థియేటర్లు వస్తాయని తెలిపారు. దీని వల్ల ప్రజలకు వారి జిల్లాలోనే కార్పోరేట్ వైద్యం అందించే ప్రయత్నం జరుగుతుందన్నారు. హైదరాబాద్ నాలుగు వైపులా నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మిస్తున్నామని .. ఇవన్నీ 4,200 పడకలతో వస్తున్నాని హరీశ్ రావు చెప్పారు. నిమ్స్‌లో 2 వేల పడకలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వుందని తెలిపారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ALso REad: కాళేశ్వరానికి వెళ్లనివ్వలేదన్న భట్టి.. జారి పడతారని పర్మిషన్ ఇవ్వలేదన్న హరీశ్ రావు

అంతకుముందు అంతర్రాష్ట్ర జల వివాదాలే ఏడాదిలో పరిష్కరించాలని , లేనిపక్షంలో .. ట్రిబ్యునల్ వేయాలని చట్టంలో వుందన్నారు హరీశ్ రావు. కేంద్రం మాటనమ్మి సుప్రీంకోర్టులో కేసు వేసినా విత్ డ్రా చేసుకున్నామని.. 9 ఏళ్లుగా బీజేపీ కృష్ణానదిలో తెలంగాణ వాటా తేల్చలేదన్నారు. నీటి కేటాయింపుల్లో కర్ణాటకకు ఒక న్యాయం.. తెలంగాణకు మరో న్యాయం అన్నట్లుగా కేంద్రం వ్యవహరిస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. నీటి వాటాపై అవసరమైతే మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్తామని.. బీజేపీకి ముగ్గురు ఎమ్మెల్యేలున్నారని, సభలో ఒక్కరు కూడా లేరని హరీశ్ రావు చురకలంటించారు. సభ కంటే వారికి బయటి రాజకీయాలే ఎక్కువని హరీశ్ దుయ్యబట్టారు. కాళేశ్వరం మీద 300 కేసులు వేసినా ఆగలేదని.. పాలమూరు కూడా అంతే వేగంగా పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. పోలవరం బ్యాక్ వాటర్‌తో తెలంగాణకు ఇబ్బంది వుందని.. బ్యాక్ వాటర్ స్టడీ కోసం సీడబ్ల్యూసీ కమిటీ వేసిందని హరీశ్ రావు తెలిపారు.