కేసీఆర్ కు హైకోర్టులో ఎదురు దెబ్బ: రూట్ల ప్రైవేటీకరణపై స్టే
ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై స్టే విధిస్తూ తెలంగాణ హైకోర్టు గురువార ంనాడు ఆదేశాలు జారీ చేసింది.
హైదరాబాద్: ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఉండాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై స్టే విధిస్తూ గురువారం నాడు ఆదేశాలు ఇచ్చింది.
ఆర్టీసీ ప్రైవేటీకరణపై గురువారం నాడు తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై సుధీర్ఘంగా విచారణ చేసింది హైకోర్టు.ఈ విచారణ సందర్భంగా ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై కేబినెట్ నిర్ణయానికి సంబంధించిన ప్రోసీడింగ్స్ను రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ హైకోర్టుకు గురువారం నాడు సీల్డ్ కవర్లో ఉంచింది.
Also read:ఆర్టీసీ సమ్మె: సెప్టెంబర్ జీతాలపై హైకోర్టు విచారణ వాయిదా
ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరించాలని తెలంగాణ కేబినెట్ తీసుకొన్న నిర్ణయాన్ని ఎందుకు అమలు చేయలేదని హైకోర్టు అడ్వకేట్ జనరల్ను ప్రశ్నించింది. అయితే ఈ విషయమై జీవో వచ్చిన తర్వాత అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం తరపున న్యాయవాది తెలంగాణ హైకోర్టుకు వివరించారు.
ఆర్టీసీ యాజమాన్యం దృష్టిలో ఉంచకుండా ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఎలా తీసుకొంటారని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పిటిషన్లో మార్పులు చేర్పులను చేయాలని కూడ పిటిషనర్ కు హైకోర్టు సూచించింది.
AlsoRead RTC Strike : మహబూబాబాద్ డిపో వద్ద ఉద్రిక్త పరిస్థితులు...
ఈ ఏడాది నవంబర్ రెండో తేదీన ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ విషయమై కేబినెట్ నిర్ణయం తీసుకొంది. అయితే కేబినెట్ తీసుకొన్న నిర్ణయం కేంద్రప్రభుత్వం చేసిన మోటార్ వాహన చట్టంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న చట్టాలకు విరుద్దంగా ఉందని కూడ హైకోర్టు వ్యాఖ్యానించింది.
కేబినెట్ ప్రోసీడింగ్స్ రహస్య డాక్యుమెంట్ అంటూ రాష్ట్ర ప్రభుత్వం తరపున న్యాయవాది వివరించారు. అయితే ఇదే సమయంలో ఎర్రమంజిల్ భవనాల కూల్చివేత, చెస్ట్ ఆసుపత్రి కూల్చివేత తదితర విషయాల్లో కేబినెల్ నిర్ణయాలకు సంబంధించిన కాపీలను అందించిన విషయాన్ని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
కేబినెట్ నిర్ణయాన్ని ఛాలెంజ్ చేయడానికి వీల్లేదని రాష్ట్ర ప్రభుత్వం చేసిన వాదనను హైకోర్టు తప్పుబట్టింది. రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ నిర్ణయాన్ని ఎవరైనా ఛాలెంజ్ చేసే అవకాశం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది.ఈ కేసు విచారణను సోమవారానికి తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది.