తెలుగు రాష్ట్రాలకు భూకంప ప్రమాదం పొంచివుందా? తెలంగాణలో భూప్రకంపనలు మొదలై ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్రకు పాకనున్నాయా? హైదరాబాద్ లో కూడా భూమి కంపిస్తుందా? అంటే అవుననే అంటోంది Epic సంస్థ. భూకంపం కేంద్రం ఎక్కడ ఉండనుంది? ఏఏ ప్రాంతాల్లో భూమి కంపిస్తుంది? అనేది ప్రకటించింది ఈ ఎపిక్.
Earthquake : ఇటీవల మయన్మార్, థాయిలాండ్ లో భూకంపం సృష్టించిన మారణహోమాన్ని మనమింకా మరిచేపోలేదు... ఇప్పుడు ఏకంగా మన రాష్ట్రంలోనూ భూకంపం సంభవించే ప్రమాదం ఉందనే హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇది ప్రజలను కంగారుపెట్టే సమాచారమే... కానీ ముందుగా హెచ్చరించడం వల్ల జాగ్రత్తగా ఉంటారు. అందువల్లే ప్రైవేట్ సంస్థ తెలంగాణలో భూకంపం సంభవించే అవకాశాలున్నాయన్న సమాచారాన్ని మీకు అందిస్తున్నాం.
రామగుండంలో త్వరలోనే భూకంపం :
తెలంగాణ రాష్ట్రంలోని రామగుండం ప్రాంతంలో భూకంపం సంభవించవచ్చని Epic (Earthquake Research & Analysis) సంస్థ ప్రకటించింది. తాము చేపట్టిన రీసర్చ్ ప్రకారం రాబోయేరోజుల్లో రామగుండం ప్రాంతంలో స్వల్ప భూకంపం సంభవిస్తుందని ఈ సంస్థ తెలిపింది. ఈ క్రమంలో హైదరాబాద్, వరంగల్, అమరావతి, ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర ప్రాంతాల్లో కూడా స్వల్ప ప్రకంపనలు చోటుచేసుకోవచ్చని అంచనా వేసి హెచ్చరించారు. రిక్టర్ స్కేలుపై 5 శాతం తీవ్రతతో ఈ భూకంపం ఉంటుందని సదరు ఎపిక్ సంస్థ సంచలన ప్రకటన చేసింది.
ఏమిటీ Epic :
ప్రపంచవ్యాప్తంగా భూకంపాలను అధ్యయనం చేసేందుకు అనేక సంస్థలు ఉన్నాయి... ఇలా భారతదేశంలో అధికారికంగా ఎన్సిఎస్ (National Center for Seismology) సంస్థ ఉంది. అయితే కొన్ని ప్రైవేట్ సంస్థలు కూడా భూకంపాలపై అధ్యయనం చేస్తున్నాయి. అలాంటిదే ఈ Epic సంస్థ. దీన్ని శివ సీతారామ్ అనే వ్యక్తి స్థాపించాడు.
తన పరిశోధన ద్వారా గ్రహించిన విషయాలను www.seismo.in వెబ్ సైట్ లో పెడతారు. ఇలా ఇప్పుడు రామగుండంలో భూకంపం సంభవించే అవకాశాలున్నాయని... అదికూడా ఏప్రిల్ 10 నుండి ఏప్రిల్ 17వ తేదీవరకు రావచ్చని ప్రకటించారు. భూకంప తీవ్రత తక్కువగానే ఉండనుంది కాబట్టి ఎలాంటి ప్రమాదం ఉండదని చెబుతున్నారు. కానీ భూకంప ప్రకటన నేపథ్యంలో ఆ ప్రాంతంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండటం మంచింది.