తెలంగాణలో భూకంపం సంభవించింది. భూమి కంపించడంతో ప్రజలు ప్రాణభయంతో వణికిపోయారు. ఇలా ఏఏ జిల్లాల్లో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయో తెలుసా?
Earthquake in Telangana : తెలంగాణలో భూకంపం సంభవించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. అయితే భూకంప తీవ్రత తక్కువగా ఉండటంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. కానీ ఈ భూకంప భయం ప్రజలకు రాత్రంతా నిద్రలేకుండా చేసింది.
ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.8 గా నమోదయ్యింది.. అంటే ఇదంత ప్రమాదకరం కాదు. కానీ కాళ్లకింద భూమి ఒక్కసారిగా కదలడంతో ప్రజలు ఆందోళనతో వణికిపోయారు. ఇళ్ళలో వస్తువులు కదలడంతో ఏం జరుగుతుందో ఒక్కక్షణం అర్థంకాక బయటకు పరుగులు తీసారు. ఇలా కరీంనగర్ జిల్లా ప్రజలను భూకంపం వణికించింది.
గంధాదర, చొప్పదండి, రామడుగు మండలాల్లో భూమి కంపించింది. సిరిసిల్ల, వేములవాడ, సుల్తానాబాద్, జగిత్యాల ప్రాంతాల్లో కూడా భూమి కంపించినట్లు తెలుస్తోంది. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా స్వల్పంగా భూమి కంపించింది. నిర్మల్, కడెం, జన్నారం, ఖానాపూర్ ప్రాంతాల్లో భూమి కంపించినట్లు తెలుస్తోంది.
అయితే భూకంప కేంద్రం కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకటించింది. భూమిలో 10 కిలోమీటర్ల లోపల భూకంప కేంద్రం ఉందని తెలిపారు. భూమిలోని పొరల సర్దుబాటు కారణంగా భూకంపాలు వస్తుంటాయి.. తాజాగా తెలంగాణలో వచ్చిన భూకంప తీవ్రత తక్కువగా ఉండటంతో ఆస్తినష్టం గానీ, ప్రాణనష్టం గాని జరగలేదు.