తెలంగాణ ఎంసెట్ ఫలితాలు : ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల హవా.. టాప్ ర్యాంకులూ వారివే...
తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో ఏపీకి చెందిన విద్యార్థులు సత్తా చాటారు. టాప్ టెన్ ర్యాంకుల్లో ఎక్కువ శాతం వారే కైవసం చేసుకున్నారు.
హైదరాబాద్ : తెలంగాణలో ఎంసెట్ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఈ ఫలితాల్లో ఇంజనీరింగ్ విభాగంలో 80% మంది ఉత్తీర్ణులయ్యారు. ఇక మెడికల్ అండ్ అగ్రికల్చర్ లో కూడా 80 శాతం మంది ఉత్తీర్ణుడైనట్లుగా సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రశ్నాపత్రాల లీకేజీతో గందరగోళ పరిస్థితులను నెలకొన్న దృష్ట్యా.. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని.. ఎంసెట్ పరీక్షల నిర్వహణలో అత్యంత జాగ్రత్త వహించామని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
అంతేకాదు, అనుకున్న సమయానికి ఫలితాలను ఇచ్చేందుకు కృషి చేశామని.. అన్నారు. దీనికి సహకరించిన అధికారి యంత్రాంగానికి ఈ సందర్భంగా మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో మరో ప్రత్యేకత ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కు చెందిన విద్యార్థులు ఎక్కువ శాతం సత్తా చాటారు. ఇంజనీరింగ్, అగ్రి కల్చర్ అండ్ మెడికల్ లలో ఎక్కువగా ఆంధ్ర విద్యార్థులే ఉన్నారు. ఇంజనీరింగ్ లో టాప్ టెన్ లో ఎనిమిది మంది.. అగ్రి కల్చర్, మెడికల్ లలో టాప్ టెన్ లో ఏడుగురు ఏపీకి చెందిన విద్యార్థులే ఉన్నారు.
నేడే తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల.. ఎలా చెక్ చేసుకోవాలంటే ?
వీరికి సంబంధించిన జాబితాను గమనిస్తే..
ఇంజనీరింగ్ మొదటి ర్యాంకులో సనపల అనిరుధ్ (విశాఖపట్నం), రెండో ర్యాంకు ఎక్కింటి పని వెంకట మణిందర్ రెడ్డి (గుంటూరు), చల్లా ఉమేష్ వరుణ్ ( నందిగామ), అభినీత్ మాజేటి ( కొండాపూర్), పొన్నతోట ప్రమోద్ కుమార్ రెడ్డి (తాడిపత్రి), మారదాన ధీరజ్ కుమార్ ( విశాఖపట్నం), వడ్డే శాన్విత రెడ్డి ( నల్గొండ), బోయిన సంజన ( శ్రీకాకుళం), నంద్యాల ప్రిన్స్ బ్రహ్మం రెడ్డి ( నంద్యాల), మీసాల ప్రణతి శ్రీజ ( విజయనగరం).. వరుసగా 1 నుంచి పది ర్యాంకులు సాధించారు.
అగ్రికల్చర్ అండ్ మెడికల్ టాపర్లలో కూడా ఏపీ విద్యార్థులే అధికంగా ఉన్నారు.. వీరిలో మొదటి ర్యాంకును బూరుగుపల్లి సత్యరాజ్ జస్వంత్ ( తూర్పుగోదావరి జిల్లా), నశిక వెంకట తేజ ( చీరాల), సఫల్ లక్ష్మి పసుపులేటి ( సరూర్నగర్), దుర్గెంపూడి కార్తికేయ రెడ్డి ( తెనాలి), బోర వరుణ్ చక్రవర్తి ( శ్రీకాకుళం), దేవగుడి గురు శశిధర్ రెడ్డి (, హైదరాబాద్), వంగీపురం హర్షిల్ సాయి (నెల్లూరు), దద్దనాల సాయి చిద్విలాస్ రెడ్డి ( గుంటూరు), గంధమనేని గిరి వర్షిత ( అనంతపురం), కొల్లబాతుల ప్రీతం సిద్ధార్థ్ ( హైదరాబాద్)లు వరుసగా 1 నుంచి పది ర్యాంకులు సాధించారు.
ఇక ఎంసెట్ అగ్రికల్చర్- మెడికల్ విభాగాల్లో పరీక్షల కోసం 94,589 మంది తెలంగాణ విద్యార్థులు దరఖాస్తు చేయగా.. 20,743 మంది ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం పరీక్షకు హాజరైన విద్యార్థులు 1,01,544 మంది. వీరిలో 91, 935 మంది ఉత్తీర్ణులయ్యారు. 86% ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలికల ఉత్తీర్ణత శాతం 87 కాగా.. బాలుర ఉత్తీర్ణత శాతం 84గా ఉంది.
ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగంలో కూడా తెలంగాణ నుంచి 1,53,890 మంది విద్యార్థులు పరీక్షలకు దరఖాస్తు చేసుకోగా.. ఆంధ్రప్రదేశ్ నుంచి 51,461 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో మొత్తం పరీక్షకు హాజరైన విద్యార్థులు 1,95,275 మంది ఉండగా.. 1,57,879 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో కూడా బాలికలదే పై చేయిగా ఉంది. బాలికలు 82% ఉత్తీర్ణత సాధించగా.. బాలురు 79 శాతం ఉత్తీర్ణత సాధించారు.