రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలతో పాటు వచ్చే మూడు రోజుల్లో వర్ష సూచన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అప్రమత్తమయ్యారు. ఈ మేరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్‌లతో ఆయన మాట్లాడారు. 

రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో (telangana floods) తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ (somesh kumar) అధికారులు, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారులకు సెలవులు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. పొరుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని.. రిజర్వాయర్లు, చెరువులు పూర్తిగా నిండాయని సోమేష్ కుమార్ పేర్కొన్నారు. అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా వుండాలని సీఎస్ హెచ్చరించారు. ప్రాణ నష్టం జరగకుండా చూడాలని ఆయన సూచించారు. 

మరోవైపు.. రాగల 72 గంటల పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ (imd) హెచ్చరించిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ (kcr) అప్రమత్తమయ్యారు. గోదావరిలోకి భారీగా వరద నీరు పోటెత్తే అవకాశం వుండటంతో గోదావరి పరివాహక ప్రాంతాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు అప్రమత్తంగా వుండాని సీఎం సూచించారు. 

ALso Read:Telangana Rains: మరో నెల రోజులు సమృద్దిగా వానలు.. రానున్న మూడు రోజులు అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు అలర్ట్

ఇకపోతే... ఉప‌రిత‌ల ఆవ‌ర్త‌నం, ద్రోణి ప్ర‌భావంతో రాష్ట్రంలో రాగ‌ల 4 వారాల పాటు వ‌ర్షాలు స‌మృద్ధిగా కురుస్తాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. దీంతో రానున్న మూడు రోజుల పాటు ఈశాన్య‌, ఉత్త‌ర తెలంగాణ జిల్లాల‌కు వాతావ‌ర‌ణ శాఖ రెడ్ అల‌ర్ట్ జారీ చేసింది. ఆ జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులుతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 

వాతావరణ శాఖ తాజా బులిటెన్ ప్రకారం.. ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రేపు ఉదయం 8.30 గంటల వరకు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 

ఇక, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, నిజామాబాద్, ములుగు, నల్గొండ, జనగామ, సిద్దిపేట, వికారాబాద్, కామారెడ్డి, మహబూబ్‌ నగర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఈ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రేపు ఉదయం 8.30 గంటల వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. భద్రాద్రి కొత్తగూడెం, యదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీచేసింది. ఈ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో రేపు ఉదయం 8.30 గంటల వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.