టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్రకు సీనియర్లు డుమ్మా కొట్టడంతో తెలంగాణ కాంగ్రెస్‌లో మరోసారి కలకలం రేగింది. ఈ నేపథ్యంలో మహేశ్వర్ రెడ్డి స్పందించారు. ఎవరు యాత్రలు చేసినా కాంగ్రెస్ కోసమేనని అన్నారు. 

రేవంత్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డిలు పోటాపోటీగా పాదయాత్రలు నిర్వహించడంతో తెలంగాణ కాంగ్రెస్‌లో కలకలం రేగింది. మరోసారి పంచాయతీలు మొదలయ్యాయంటూ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహేశ్వర్ రెడ్డి స్పందించారు. తమ మధ్య గ్రూపులు లేవని.. పార్టీలో ఐక్యంగా ముందుకు వెళ్తామని ఆయన తెలిపారు. అధిష్టానం ఆదేశాల మేరకే నేతలంతా పాదయాత్రలు చేస్తున్నారని మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. రేవంత్‌ది, తనది కాంగ్రెస్ యాత్రలేనని.. రెండూ హాత్ సే హాత్ జోడో యాత్రలేనని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అంతా ఒకటే కుటుంబమని.. సీనియర్లు వారి అనుకూలతను బట్టి యాత్రలకు హాజరవుతారని మహేశ్వర్ రెడ్డి తేల్చేశారు. అందరం కలిసి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తామని ఆయన తెలిపారు. తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి బలమైన కేడర్, నేతలు వున్నారని మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. 

కాగా.. రేవంత్ రెడ్డికి పోటీగా మహేశ్వర్ రెడ్డి సైతం పాదయాత్రకు దిగడంతో పంచాయతీ మొదలైంది. ఈ సందర్భంగా సీనియర్ నేతలు రేవంత్ పాదయాత్రకు డుమ్మా కొట్టి.. మహేశ్వర్ రెడ్డికి మద్ధతు పలికారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహలు మహేశ్వర్ రెడ్డి యాత్రకు హాజరయ్యారు. అటు టీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్‌రావు థాక్రే మాత్రం రేవంత్ పాదయాత్రకు హాజరవ్వడం కలకలం రేగింది. మహేశ్వర్ రెడ్డి పాదయాత్రకు అధిష్టానం ఆమోదం వుందని సీనియర్లు అంటున్నారు. 

ALso REad: టీ.కాంగ్రెస్‌లో పాదయాత్రల పంచాయతీ : రేవంత్ యాత్రకు సీనియర్లు డుమ్మా.. మహేశ్వర్ రెడ్డికి ఉత్తమ్, భట్టి మద్ధతు

ఇకపోతే.. అంతకుముందు పాదయాత్రలపై స్పందించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. పాదయాత్రలు ఎవరూ చేసిన తప్పు లేదన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి పాదయాత్రలు హత్ సే హత్ జోడో పరిధిలోకే వస్తాయన్నారు. అందరూ పాదయాత్రలు చేయాల్సిందేనని .. పాదయాత్రలు చేయకపోతే పార్టీ నేతలపై చర్యలుంటాయని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అలాగే గవర్నర్ తమిళిసై రాజకీయ నాయకురాలిగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. పెండింగ్ బిల్లుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు కు వెళ్లిన అంశంపై మీడియా ప్రశ్నలపై ఆయన స్పందించారు. సీఎస్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత శాంతికుమారి రాజ్ భవన్ కు రాని విషయాన్ని గవర్నర్ ట్వీట్ చేయడాన్ని రేవంత్ రెడ్డి తప్పు బట్టారు. అధికారులను పిలిపించి మాట్లాడే హక్కు గవర్నర్ కు ఉందన్నారు. 

సెక్షన్ 8 ప్రకారంగా హైద్రాబాద్ గవర్నర్ పరిధిలో ఉన్న విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. అధికారులను పిలిచి సమీక్ష నిర్వహించే అధికారం గవర్నర్ కు ఉందని చెప్పారు. సమీక్షలు నిర్వహించిన సమయంలో సమీక్షలకు రాని అధికారులపై చర్యలు తీసుకొనే అధికారం కూడా గవర్నర్ కు ఉన్న విషయాన్ని రేవంత్ రెడ్డి వివరించారు. ఐఎఎస్, ఐపీఎస్ అధికారులు తాను నిర్వహించిన సమీక్షలకు రాకపోతే వారిపై డీఓపీటీకి ఫిర్యాదు చేయవచ్చని రేవంత్ రెడ్డి చెప్పారు. సెక్షన్ 8 గురించి తెలియకపోతే తమకు సమయం ఇస్తే ఈ విషయమై గవర్నర్ కు వివరించేందుకు సిద్దంగా ఉన్నామని రేవంత్ రెడ్డి చెప్పారు.