మాణిక్ రావు థాక్రే రాకతో ఇప్పుడిప్పుడే గాడిన పడుతుందనుకున్న తెలంగాణ కాంగ్రెస్లో మరోసారి నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్రకు సీనియర్లు డుమ్మా కొట్టారు.
తెలంగాణ కాంగ్రెస్లో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి పోటీగా మహేశ్వర్ రెడ్డి సైతం పాదయాత్రకు దిగడంతో పంచాయతీ మొదలైంది. ఈ సందర్భంగా సీనియర్ నేతలు రేవంత్ పాదయాత్రకు డుమ్మా కొట్టి.. మహేశ్వర్ రెడ్డికి మద్ధతు పలికారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహలు మహేశ్వర్ రెడ్డి యాత్రకు హాజరయ్యారు. అటు టీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు థాక్రే మాత్రం రేవంత్ పాదయాత్రకు హాజరవ్వడం కలకలం రేగింది. మహేశ్వర్ రెడ్డి పాదయాత్రకు అధిష్టానం ఆమోదం వుందని సీనియర్లు అంటున్నారు.
ఈ ఏడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని పార్టీ నాయకత్వం పట్టుదలగా ఉంది. అయితే నేతల మధ్య సమన్వయం లేదు. దీంతో పార్టీ నేతల మధ్య సమన్వయం కోసం అధినాయకత్వం చర్యలు తీసుకుంటోంది. అంతర్గత విషయాలపై నేతలంతా పార్టీ సమావేశాల్లోనే చర్చించాలని నాయకత్వం సూచనలు చేసింది. మాణికం ఠాగూర్ రాష్ట్ర ఇంచార్జీ పదవి నుండి తప్పుకొన్న తర్వాత రేవంత్ రెడ్డి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు తమ మధ్య ఉన్న అభిప్రాయబేధాలను కూడా పక్కన పెట్టాలని కూడా రేవంత్ రెడ్డి కోరారు. ఈ విషయమై అవసరమైతే తాను సామాన్య కార్యకర్త మాదిరిగా కూడా పనిచేసేందుకు సిద్దమని రేవంత్ రెడ్డి ప్రకటించారు.
మాణిక్ రావు థాక్రే వచ్చిన తర్వాత అంతా సెట్ అవుతోంది అనుకుంటున్న సమయంలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన పొత్తు వ్యాఖ్యలు కలకలం రేపాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పొత్తు ఉంటుందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ సీనియర్లు తప్పు బట్టారు.
