పేర్లు కూడా పెట్టేశారు
- సీఎం నూతన గృహ ప్రవేశం రేపే
- సమావేశ మందిరాలకు పేర్ల నిర్ణయం
- జనహిత, ప్రగతి భవన్ పేర్లతో సమావేశ మందిరాలు
తెలంగాణ సీఎం కె. చంద్రశేఖర్ రావు పకడ్బంది వాస్తుతో ప్రత్యేకంగా నిర్మించుకున్న ఇంటికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం ఉదయం 5.22 కు సీఎం దంపతులు నూతన గృహ ప్రవేశం చేయనున్నారు.
ఈ కార్యక్రమానికి గవర్నర్ దంపతులు, చిన్న జీయర్ స్వామి కూడా హాజరుకానున్నారు. బేగంపేటలో ప్రస్తుతమున్న సీఎం క్యాంపు ఆఫీసు వెనుక 9 ఎకరాల విస్తీర్ణంలో సీఎం కొత్త క్యాంపు ఆఫీసు, నివాస భవనం, ప్రత్యేక మీటింగ్ హాల్ నిర్మించిన విషయం తెలిసిందే.
ఆర్ అండ్ బీ విభాగం రూ.38 కోట్ల అంచనా వ్యయంతో 3 బ్లాక్లుగా ఈ నిర్మా ణాలు చేపట్టింది. దాదాపు వెయ్యిమందితో సమావేశమయ్యేలా నిర్మించిన మీటింగ్ హాల్ కు జనహిత అనే పేరు పెట్టారు. ఇందులో సీఎంను కలిసేందుకు వచ్చే సామాన్యులు, రైతులు, కార్మికులను కలిసేందుకు, వారితో చర్చించేందుకు వీలుగా నిర్మించారు.
అలాగే, రాష్ట్రంలోని వివిధ అంశాలపై అధికారులు, ప్రజాప్రతినిధులతో చర్చించేందుకు నిర్మించిన మరో భవనానికి ప్రగతి భవన్ అని నామకరణం చేశారు.
సీఎం గృహ ప్రాంగణమంతా పచ్చదనం వెల్లివిరిసేలా మొక్కలు నాటారు. ముఖ్యమంత్రి సూచన మేరకు వివిధ రకాల మొక్కలను సేకరించి ఇక్కడ పెంచే బాధ్యతను హెచ్ఎండీఏకు అప్పగించారు. తొమ్మిది నెలల్లోనే ఈ భవనాన్ని పూర్తి చేశారు.