42 మంది ఎమ్మెల్యేలు దిగదుడుపే: అప్రమత్తం చేసిన కేసీఆర్
ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్దంగా ఉండాలని తెలంగాణ సీఎం కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలకు సూచించారు. పార్టీ ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్ ఫోన్లో మాట్లాడారు.నియోజకవర్గాల్లోని పరిస్థితిని ఆరా తీశారు. 42 మంది ఎమ్మెల్యేలను తమ పనితీరును మెరుగుపర్చాలని సూచించారు.
హైదరాబాద్: ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్దంగా ఉండాలని తెలంగాణ సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సూచించారు. విపక్ష పార్టీలకు చెందిన నేతలు ఏం చేస్తున్నారనే విషయాలపై కేసీఆర్ ఆరా తీశారు.42 మంది ఎమ్మెల్యేలు తమ పనితీరును ఇంకా మెరుగుపర్చుకోవాలని ఆయన సూచించారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఫోన్లు చేశారు. ఆయా నియోజకవర్గాల్లో నెలకొన్న పరిస్థితులపై ఆరా తీశారు. తాను నిర్వహించిన సర్వేలకు సంబంధించిన రిపోర్టు్లను కేసీఆర్ ఎమ్మెల్యేలకు వివరించారు. ఎమ్మెల్యేల బలాలు, బలహీనతలు, ప్రత్యర్ధుల బలాలు , బలహీనతలు తదితర అంశాలను కేసీఆర్ వివరించారు.
ఏ సర్వేలో ఏ ఎమ్మెల్యేకు ఏ రకమైన ఫలితాలు వచ్చాయనే విషయమై కేసీఆర్ స్వయంగా ఆయా ఎమ్మెల్యేలకు వివరించారు. నియోజకవర్గంలో పరిస్థితులపై కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలను ఆరా తీశారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎంత మెజారిటీతో విజయం సాధిస్తామనే విషయమై కూడ కేసీఆర్ ఎమ్మెల్యేలను అడిగారు.
అయితే పార్టీ నుండి ఏ రకమైన సహాయం కావాలనే విషయమై కేసీఆర్ ఆరా తీశారు. పార్టీ పరిస్థితిపై కూడ స్థానిక ఎమ్మెల్యేలతో కేసీఆర్ చర్చించారు. విపక్ష పార్టీలకు చెందిన నేతలు నియోజకవర్గంలో ఏం చేస్తున్నారనే విషయమై కూడ ఆయన స్థానిక ఎమ్మెల్యేలతో చర్చించారు.
అయితే ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్దంగానే ఉండాలని కేసీఆర్ ఎమ్మెల్యేలకు సూచించారు. అంతేకాదు సర్వే రిపోర్ట్ ఆధారంగా ఎమ్మెల్యేలకు పలు సూచనలు చేశారు. ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ సిద్దమనే సంకేతాలు ఇచ్చిన తరుణంలో ఎమ్మెల్యేలతో కేసీఆర్ ఫోన్లో చర్చించడం ప్రాధాన్యతను సంతరించుకొంది.
ఇప్పటివరకు వచ్చిన సర్వే రిపోర్ట్ ప్రకారంగా సుమారు 42 మంది ఎమ్మెల్యే పరిస్థితిపై ప్రజల నుండి సానుకూలమైన స్పందన రాలేదు. దీంతో ఆయా నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేను కేసీఆర్ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించినట్టు సమాచారం. సర్వే రిపోర్ట్ ప్రకారంగా ఆ ఎమ్మెల్యేలను ఎన్నికల సమయం నాటికి నియోజకవర్గంలో ప్రత్యర్ధుల కంటే ఏ రకంగా ముందుకు వెళ్లాలనే విషయమై కేసీఆర్ సూచనలు చేసిట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అయితే ఏ కారణాలతో ఆయా నియోజకవర్గాల్లో కొందరు ఎమ్మెల్యేలు వెనుకబడ్డారనే విషయాలపై కూడ కేసీఆర్ ఆయా ఎమ్మెల్యేలకు వివరించినట్టు సమాచారం.ఈ సమాచారం ఆధారంగానే ఆయా ఎమ్మెల్యేలు జాగ్రత్తలు తీసుకొంటున్నారు. అయితే ఎన్నికల నాటికి కూడఆయా నియోజకవర్గాల్లో పరిస్థితుల్లో మార్పులు రాకపోతే ఏం చేస్తారనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టిక్కెట్లు ఇస్తానని కేసీఆర్ ఇప్పటికే స్పష్టత ఇచ్చారు.
అయితే స్థానికంగా ఇబ్బందికర పరిస్థితులున్నా సిట్టింగ్లకు టిక్కెట్లు ఇచ్చే పరిస్థితి ఉంటుందా అనే విషయమై సర్వత్రా ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. అయితే ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన ఎమ్మెల్యేలు విజయం సాధించాలంటే గెలుపు గుర్రాలకు టిక్కెట్లు కేటాయించాల్సిన అనివార్య పరిస్థితులు కేసీఆర్కు ఉంటాయని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో రేసులో వెనుకబడిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండక తప్పని పరిస్థితులు లేకపోలేదని విశ్లేషకులు చెబుతున్నారు.