పదవుల కోసం ఏనాడు పాకులాడలేదు .. తెలంగాణ ఆగం కావొద్దనే నా బాధ: కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
తాను పదవుల కోసం పాకులాడటం లేదని.. ప్రజల దయ వల్ల ఇప్పటికే రెండుసార్లు సీఎం అయ్యానని తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు. ఉన్న తెలంగాణను ఊడగొట్టి 58 ఏళ్లు గోసలు పెట్టింది కాంగ్రెస్ పార్టీ అన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. కాంగ్రెస్ గెలిస్తే 24 గంటల కరెంట్ను కాంగ్రెస్ కాకి ఎత్తుకుపోతుందని కేసీఆర్ సెటైర్లు వేశారు.
![telangana cm kcr sensational comments at brs praja ashirvada sabha ksp telangana cm kcr sensational comments at brs praja ashirvada sabha ksp](https://static-ai.asianetnews.com/images/01hetpvekm5t7fac5angn0892a/kcr-png_363x203xt.jpg)
తాను పదవుల కోసం పాకులాడటం లేదని.. ప్రజల దయ వల్ల ఇప్పటికే రెండుసార్లు సీఎం అయ్యానని తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం పరిగిలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ప్రసంగిస్తూ.. సాధించుకున్న తెలంగాణ ఆగం కావొద్దనేది తన తాపత్రయమన్నారు. వచ్చే ఏడాది మిషన్ మోడ్లో పేదలకు ఇళ్లు నిర్మిస్తామని.. బీఆర్ఎస్ మళ్లీ గెలిస్తే, పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. తాను ఉన్నంత వరకు బీఆర్ఎస్ ముమ్మాటికీ సెక్యులర్ పార్టీయేనని సీఎం వెల్లడించారు. ఎస్సీలు, ఎస్టీలను కాంగ్రెస్ పార్టీ కేవలం ఓటు బ్యాంకుగా చూసిందని కేసీఆర్ దుయ్యబట్టారు.
ఉన్న తెలంగాణను ఊడగొట్టి 58 ఏళ్లు గోసలు పెట్టింది కాంగ్రెస్ పార్టీ అన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. తెలంగాణ ఏర్పడిన రోజున భయంకరమైన సమస్యలు వున్నాయన్నారు. తెలంగాణ ప్రజల హక్కుల కోసమే బీఆర్ఎస్ పుట్టిందని.. ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ వచ్చామని కేసీఆర్ తెలిపారు. 3 కోట్ల మందికి కంటి పరీక్షలు చేయించామని.. కంటి వెలుగులో 80 లక్షల మందికి కళ్లద్దాలు ఇచ్చామని ఆయన చెప్పారు. రైతుబంధు అనే పథకాన్ని పుట్టించిందే కేసీఆర్ అని.. రైతులకు 24 గంటలు నాణ్యమైన , ఉచిత విద్యుత్ ఇస్తున్నామన్నారు.
రైతులకు 24 గంటల కరెంట్ వ్యర్ధమని పీసీసీ అధ్యక్షుడు అన్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ గెలిస్తే 24 గంటల కరెంట్ను కాంగ్రెస్ కాకి ఎత్తుకుపోతుందని కేసీఆర్ సెటైర్లు వేశారు. ధరణి పోర్టల్ తీసేస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరణి తీసేసి భూమాత తెస్తామని అంటున్నారని.. ధరణి తీసేస్తే రైతుబంధు ఎలా వస్తుందని కేసీఆర్ ప్రశ్నించారు. ధరణి తీసేస్తే మళ్లీ దళారుల రాజ్యం వస్తుందని , బీఆర్ఎస్ గెలిస్తే రైతుబంధును రూ.16 వేలకు పెంచుతామని సీఎం తెలిపారు. తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ చేయటమే తన లక్ష్యమని కేసీఆర్ చెప్పారు.