- Home
- Telangana
- Weather Update: బంగాళాఖాతంలో ఒక్కసారిగా మారిన సీన్.. ఏపీ, తెలంగాణకు తుపాను ముప్పు.. భారీ వర్షాలు
Weather Update: బంగాళాఖాతంలో ఒక్కసారిగా మారిన సీన్.. ఏపీ, తెలంగాణకు తుపాను ముప్పు.. భారీ వర్షాలు
Weather Update: తెలుగు రాష్ట్రాల వాతావరణ శాఖ బిగ్ అప్డేట్ ఇచ్చింది. బంగాళాఖాతంలో వాయుగుండంతో ఏపీ, తెలంగాణలో రాగల 6 రోజులు వర్షాలు కురుస్తాయని తెలిపింది. వర్షాలతో పాటు ఈదురుగాలులు ఉంటాయనీ, పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు సైతం ఉంటాయని అంచనా వేసింది.

IMD Rain Alert: ఏపీ, తెలంగాణలో వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారి, ఆపై వాయుగుండంగా పరిణామం చెందింది. ఇది రాత్రి సమయంలో బెంగాల్ వద్ద తీరాన్ని దాటింది. తీరం దాటిన ఈ వాయుగుండం ప్రభావంతో పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వాయుగుండం సుడి ప్రభావం కొద్దిగా ఏపీ, తెలంగాణ సరిహద్దుల వరకు విస్తరించి ఉంది.
అయితే తెలుగు రాష్ట్రాలపై ఈ వాయుగుండం ప్రభావం నేరుగా ఉండదని అధికారులు తెలిపారు. అయినప్పటికీ, దీని వల్ల ఆగస్టు 13న ఇరు రాష్ట్రాల్లోనూ సుడిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అలాగే, వర్షాలు కురుస్తాయని తెలిపారు.
రాబోయే 6 రోజుల వాతావరణం పై ఐఎండీ కీలక అప్డేట్
భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించిన సమాచారం ప్రకారం, ఆగస్టు 13 నుండి 18 వరకు తెలంగాణ, కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమ, దక్షిణ అంతర్గత కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో అక్కడక్కడా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. అయితే, కొన్ని చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కూడా పడే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.
తీవ్ర గాలుల హెచ్చరికలు
కోస్తా ఆంధ్ర, యానాం, రాయలసీమ: ఆగస్టు 13, 14 తేదీల్లో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉంది. అలాగే ఆగస్టు 15, 16 తేదీల్లో గంటకు 30 నుండి 40 కిమీ వేగంతో గాలులు వీస్తాయి.
తెలంగాణ: ఆగస్టు 13 నుండి 16 మధ్య కాలంలో రాష్ట్రవ్యాప్తంగా గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
ఆగస్టు 12 నుండి 16 వరకు రెండు రాష్ట్రాల్లో ఉపరితల గాలులు చాలా బలంగా వీచే అవకాశం ఉందని ఇదివరకు హెచ్చరించింది.
తెలంగాణ వెదర్ ఎలా ఉంది?
తెలంగాణలో నైరుతి రుతుపవనాలు కొనసాగుతుండటంతో చాలా జిల్లాల్లో వాతావరణం పాక్షికంగా మేఘావృతమై ఉంది. హైదరాబాద్ లో కనిష్ఠ ఉష్ణోగ్రత 28°C కాగా, గరిష్ఠ ఉష్ణోగ్రత 38°C వరకు నమోదైంది. నగరంలో అక్కడక్కడా స్వల్పంగా వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడుతున్నాయి.
ఇక గత 24 గంటల గణాంకాలను పరిశీలిస్తే, కుమురం భీం జిల్లా ఎల్కపల్లిలో అత్యధికంగా 7.3 సెం.మీ, దహేగామ్లో 6 సెం.మీ, కరీంనగర్ జిల్లా శంకరపట్నంలో 5 సెం.మీ, ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో 4 సెం.మీ వర్షపాతం నమోదైంది. అలాగే హైదరాబాద్ ముషీరాబాద్లో 2 సెం.మీ వర్షం పడింది. రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 34°C వరకు ఉండనుంది. గాలిలో తేమ 50 శాతంగా ఉండటం వల్ల ప్రధానంగా ఉత్తర తెలంగాణలోనే జల్లులు పడేందుకు అనుకూల వాతావరణం ఉంది. మిగతా ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉండే ఛాన్స్ ఉంది.
మత్స్యకారులకు అలర్ట్
ఆంధ్రప్రదేశ్లోని అమరావతి ప్రాంతంలో ఉష్ణోగ్రతలు 27°C నుండి 40°C వరకు నమోదయ్యాయి. ఈదురుగాలులు, మెరుపులతో కూడిన జల్లులు పడ్డాయి. ఉత్తర కోస్తా, రాయలసీమలో కూడా బలమైన ఈదురుగాలులతో వర్షాలు పడుతున్నాయి. ఏపీలో గరిష్ఠ ఉష్ణోగ్రత 36°C వరకు ఉండే అవకాశం ఉంది. తేమ శాతం ఉత్తరాంధ్రలో 58% కాగా, కోస్తాంధ్ర, రాయలసీమల్లో 42% గా ఉంది. ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాలు, పశ్చిమ మధ్య, తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఆగస్టు 13 నుండి 15 వరకు సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, కాబట్టి మత్స్యకారులు ఎవరూ చేపలవేటకు వెళ్లొద్దని ఐఎమ్డీ స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది.
పసిఫిక్ మహాసముద్రంలో తుపాను
ఇక ప్రపంచవ్యాప్త వాతావరణ మార్పులను చూస్తే.. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన 8 అల్పపీడనాల్లో ఒకటి తుపానుగా మారి దానికి '01C' అని పేరు పెట్టారు. ఇది గంటకు 65 కిమీ వేగంతో తిరుగుతూ మరింత బలపడుతోంది. ఎల్ నినో ప్రభావం వల్ల వేడి తీవ్రత కూడా ఎక్కువే ఉంది. భారత్లో భారీ వర్షాలు పడాలంటే అరేబియా సముద్రంలో గానీ, బంగాళాఖాతంలో గానీ శక్తివంతమైన తుపాను లేదా వాయుగుండం ఏర్పడాల్సి ఉంది. ప్రస్తుతం మాల్దీవులకు దక్షిణంగా హిందూ మహాసముద్రంలో ఒక ఆవర్తనం తయారవుతోంది, ఇది కనుక తుపానుగా మారి మన దేశం వైపు వస్తే రాబోయే రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది.

