Hyderabad: ఇక్కడ ల్యాండ్ ఉన్న వాళ్లు అదృష్టవంతులు.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు.
గురువారం తెలంగాణ కేబినెట్ సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హెచ్ఎండీఏ పరిధి పెంపుతోపాటు ఫ్యూచర్ సిటీకి సంబంధించిన కొన్ని వివరాలను మంత్రివర్గం తెలిపింది. తెలంగాణ మంత్రివర్గం తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ట్రిపులార్ ప్రాజెక్టును చేపడుతోన్న విషయం తెలిసిందే. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మొదలు పెట్టిన ఈ ప్రాజెక్టులో కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ ఈ ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తోంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టుకు సహకరించేందుకు ముందుకొచ్చింది. ట్రిపులార్ చుట్టూ రైల్వే లైన్ను చేపట్టాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా నిర్వహించిన తెలంగాణ కేబినెట్ సమావేశాల్లో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
హెచ్ఎండీఏ పరిధి విస్తరణ:
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన తెలంగాణ కేబినెట్ హెచ్ఎండీఏ పరిధిని ట్రిపులార్ వరకు విస్తరించనున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా 11 జిల్లాల్లోని 1355 గ్రామాలు హెచ్ఎండీఏ పరిధిలోకి రానున్నాయి. ఇక ఫ్యూచర్ సిటీకి కూడా పెద్దపీట వేయనున్నట్లు ప్రకటించింది. తెలంగాణను కోర్ తెలంగాణ, అర్బన్ తెలంగాణ, రూరల్ తెలంగాణగా విభజించనున్నారు. దీంతో ప్రస్తుతం ఉన్న అవుటర్ రింగ్ రోడ్, కొత్తగా నిర్మిస్తున్న ట్రిపులార్ మధ్య ఉన్న స్థలాలకు భవిష్యత్తులో భారీగా డిమాండ్ పెరగనుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
బీసీ రిజర్వేషన్లకు ఆమోదం:
ఇక తెలంగాణ కేబినెట్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంపుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. బీసీ రిజర్వేషన్ బిల్లుకు అందరూ సహకరించాలని మంత్రి పొన్న ప్రభాకర్ అన్నారు. మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ఇందిరమ్మ మహిళా శక్తి మిషన్ 2025 పాలసీ అమలుకు కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇకపై అన్ని మహిళా సంఘాలను ఒకే గొడుగు కిందికి తీసుకొస్తున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. ప్రతీ రెవెన్యూ గ్రామానికి ఒక జీపీవో ను నియమించాలని కేబినెట్ నిర్ణయించింది. గతంలో వీఆర్వో,వీఏవోలుగా పనిచేసిన వారికి అవకాశం కల్పిస్తామన్నారు.
ఉద్యోగాల భర్తీకి ఆమోదం:
అంతేకాకుండా తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో యాదగిరి గుట్ట బోర్టు ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. అందుకోసం ఎండోమెంట్ చట్ట సవరణకు ఆమోదం తెలిపింది. రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్ సొసైటీల్లో 330 రెగ్యులర్,165 ఔట్ సోర్సింగ్ పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది కేబినెట్. పారా ఒలంపిక్ పతక విజేత దీప్తికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీల ఆతిథ్యానికి ఆమోదం తెలిపారు. రాయికుంటలో 100 పడకలతో ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు.

