ఆర్టీసీ బిల్లుకు ఆమోదం తెలిపిన తెలంగాణ శాసనసభ , ఊపిరి పీల్చుకున్న కేసీఆర్ సర్కార్
తెలంగాణ ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై ప్రవేశపెట్టిన బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.
తెలంగాణ ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై ప్రవేశపెట్టిన బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం ముగిసిన వెంటనే తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఉద్యోగులను ప్రభుత్వ సేవల్లోకి తీసుకోవడం) బిల్లు 2023ను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. దీనిపై శాసనసభలో చర్చ అనంతరం సభ్యులు ఆమోదం తెలిపారు.
అంతకుముందు తెలంగాణ ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఇవాళ మధ్యాహ్నం ఆర్టీసీ, రవాణాశాఖ ఉన్నతాధికారులతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సమావేశమయ్యారు. రవాణా శాఖకు చెందిన ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు సహా ఆర్టీసీకి చెందిన ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆర్టీసీలో పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగుల విషయమై గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తన సందేహలను అడిగారు. గవర్నర్ లేవనెత్తిన అంశాలపై అధికారులు సమాధానం తెలిపారు.
ALso Read: కాకినాడ తీర్మానం కాకెత్తుకుపోయింది: అసెంబ్లీలో బీజేపీపై కేసీఆర్ ఫైర్
ఈ సమాధానాలపై సంతృప్తి చెందిన గవర్నర్ ఆర్టీసీ ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలిపారు. శాసనసభలో బిల్లు ప్రవేశ పెట్టేందుకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సిఫారసు చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు గవర్నర్. బిల్లుతో పాటు 10 అంశాలను గవర్నర్ సిఫారసు చేశారు. ఆస్తులను ఆర్టీసీ అవసరాలకే వినియోగించాలి, ఈ మేరకు ప్రభుత్వం నుండి స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని గవర్నర్ కోరారు. ఆర్టీసీ కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలను క్లియర్ చేయాలని కోరారు. ఆర్టీసీ బస్సుల నిర్వహణ, మెయింటెనెన్స్ ను ప్రభుత్వమే తీసుకోవాలని గవర్నర్ సూచించారు.
ఆర్టీసీ ఆస్తులు, భూములు కార్పోరేషన్ తో ఉండాలని కోరారు. ఈ మేరకు ప్రభుత్వం నుండి స్పష్టత ఇవ్వాలన్నారు. ఆర్టీసీ కార్మికులను కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా చూడాలని కోరారు. ఆర్టీసీ కార్మికుల గ్రేడ్, జీతం, ప్రమోషన్లు, ప్రయోజనాలను పరిరక్షించాలని గవర్నర్ ప్రభుత్వానికి సిఫారసు చేశారు. ఆర్టీసీ ఆసుపత్రుల్లో వైద్య సౌకర్యాలను కల్పించాలని కోరారు. దీంతో ఈ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీలో ప్రవేశ పెట్టే అవకాశం ఉంది.