తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని ఘటన... ఏకంగా పోలీస్ పైనే లాఠీచార్జ్
తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో ఓ పోలింగ్ కేంద్రం బిజెపి అభ్యర్థి సెక్యూరిటీ సిబ్బంది అయిన కానిస్టేబుల్ పై సీఐ దాడి చేసారు.
![Telangana Assembly Elections 2023 ... CI Attacked constable at Hyderabad polling station AKP Telangana Assembly Elections 2023 ... CI Attacked constable at Hyderabad polling station AKP](https://static-ai.asianetnews.com/images/01hfng81pcmkeqqt36etdetzdj/police_363x203xt.jpg)
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. ఓ పోలీస్ కానిస్టేబుల్ పై సీఐ లాఠీ ఝలిపించాడు. ఇలా పోలింగ్ కేంద్రం వద్ద పోలీసుపై మరో పోలీస్ లాఠీచార్జ్ చేయడంతో అక్కడున్నవారంతా ఆశ్చర్యపోయారు.
వివరాల్లోకి వెళితే... హైదరాబాద్ శివారులోని మహేశ్వరం నియోజకవర్గంలో అందెల శ్రీరాములు యాదవ్ పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో నిన్న పోలింగ్ సరళిని పరిశీలించేందుకు ఆయన నాదల్ గుల్ లోని పోలింగ్ కేంద్రానికి వెళ్ళారు. రాములు యాదవ్ పోలింగ్ కేంద్రంలోకి వెళ్లిపోగా ఆయన భద్రతా సిబ్బంది ఏఆర్ కానిస్టేబుల్ యాదగిరి బయట నిలబడ్డాడు.
Read More Telangana polling : బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పై కేసు నమోదు..
అయితే ఇదే సమయంలో ఆదిభట్ల సిఐ రఘువీర్ రెడ్డి కూడా నాదల్ గెల్ పోలింగ్ స్టేషన్ వద్ద పరిస్థితిని గమనించేందుకు వచ్చాడు. ఈ క్రమంలో కానిస్టేబుల్ యాదగిరిని చూసి ఆగ్రహం వ్యక్తం చేస్తూ లాఠీతో కొట్టారు. దీంతో అతడు పరుగు తీసాడు. ఇలా కానిస్టేబుల్ ను సీఐ లాఠీతో కొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఇక నిన్న పోలింగ్ సందర్భంగా పలుచోట్ల బిఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. వికారాబాద్ జిల్లాలోని తాండూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని సాయిపూర్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పీఏపై కాంగ్రెస్ వర్గీయులు దాడికి దిగారు. దీంతో ఉద్రిక్తత ఏర్పడింది.
సాయిపూర్ లో రిగ్గింగ్ జరుగుతుందని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపించడంతో గొడవ ప్రారంభమయ్యంది. ఈ క్రమంలోనే రోహిత్ రెడ్డి పీఏను పట్టుకుని కొట్టారు. దీంతో బిఆర్ఎస్ శ్రేణులు కూడా అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కానీ పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఇరువర్గాలపై లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు.