వీధికుక్కల సమస్య నివారణకు ఎనిమిది బృందాలను రంగంలోకి దింపుతామని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. దీనికోసం ప్రత్యేక టోల్ ఫ్రీ నెం. ను ప్రకటించారు. త్వరలో యాప్ ను అందుబాటులోకి తెస్తామన్నారు.
హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాదులో వీధి కుక్కల సమస్యను పరిష్కరించే దిశగా ప్రభుత్వం అనేక చర్యలకు దిగింది. వీధి కుక్కల సమస్యకు సత్వర పరిష్కారం చూపుతామని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తెలిపారు. వీటి నివారణకు ప్రత్యేక చర్యల కోసం 8 బృందాలను రంగంలోకి దించుతామన్నారు. వీధి కుక్కల బెడద, చిన్నారి మృతి, చిన్నారుల పై దాడులు నేపథ్యంలో గురువారం మసాబ్ ట్యాంకులోని తలసాని శ్రీనివాస యాదవ్ కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. ‘అంబర్పేటలో వీధి కుక్కలు చిన్నారి మీద దాడి చేసి చంపడం దారుణమైన, దురదృష్టకరమైన ఘటన. వీధి కుక్కలు సంతతి పెరిగిపోకుండా వాటికి పిల్లలు పుట్టకుండా శస్త్ర చికిత్సలు చేయిస్తాం. దీనికోసం నెల రోజులపాటు 8 బృందాలతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రత్యేక డ్రైవ్ లను చేపడతాం. కుక్కలు, కోతుల సమస్యలు ఉన్నవారు ప్రభుత్వానికి ఫిర్యాదు చేయవచ్చు. దీనికోసం 040 2111 1111 అనే కంట్రోల్ రూమ్ నెంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయండి’ అని తెలిపారు.
అంబర్పేటలో వీధి కుక్కల దాడిలో ప్రదీప్ మృతి: జీహెచ్ఎంసీపై హైకోర్టు సీరియస్
అంతే కాదు కుక్కలు కోతుల బెడద మీద ఫిర్యాదుల కోసం మొబైల్ యాప్ ను కూడా అందుబాటులోకి తెస్తామని మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో హైదరాబాద్ నగర మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, హోం మంత్రి మహమూద్ అలీ.. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్లు పాల్గొన్నారు.
ఇదిలా ఉండగా, ఈ ఘటన మీద హైకోర్టు తెలంగాణ ప్రభుత్వం, జీహెచ్ఎంసీ మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. జీహెచ్ఎంసీ నిర్లక్ష్యం కారణంగానే చిన్నారి ప్రదీప్ మృతి చెందాడని తెలిపింది. మరో వైపు హైదరాబాద్లో వీధి కుక్కలు దాడిలో ఓ బాలుడు మృతి చెందిన ఘటన, ఆ తరువాత మరో బాలుడి మీద దాడి ఘటన వెంటవెంటనే జరిగిన నేపథ్యంలో నగర అధికారులు స్టెరిలైజేషన్ ప్రయత్నాలను ముమ్మరం చేయడానికి నడుం బిగించారు. వీధి కుక్కలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తిస్తున్నారు.
ఆదివారం హైదరాబాద్లో ఐదేళ్ల బాలుడిని వీధికుక్కలు దాడి చేసి.. దారుణంగా కరవడంతో తీవ్ర రక్తస్రావంతో, గాయాలతో ఆ చిన్నారి ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. ఇది వెలుగులోకి రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటన మీద చర్యలు తీసుకునేలోపే.. బుధవారం మరో పసిబిడ్డ వీటి బారిన పడ్డాడు. ఇంటి బయట ఆడుకుంటున్న నాలుగేళ్ల బాలుడిని కుక్కలు వెంటపడి కరిచాయి. తల్లిదండ్రులు వెంటనే అలర్ట్ అవ్వడంతో పెనుప్రమాదం తప్పింది.
నగరంలో వీధికుక్కల అరాచకం మీద హైకోర్టు కూడా ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించింది. వీధి కుక్కల సమస్యకు పరిపాలన పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఉందని హైదరాబాద్ గవర్నర్ అన్నారు. బుధవారం జరిగిన సమావేశంలో ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్కుమార్ నగర వెటర్నరీ అధికారులు, జోనల్ కమిషనర్లకు వీధి కుక్కల బెడద నివారణకు కార్యాచరణ ప్రణాళికను వివరించారు.
కుక్కల దాడులు ఎక్కువగా నమోదయ్యే ప్రాంతాలను గుర్తించాలని, వాటిని అరికట్టేందుకు పశువైద్య బృందాలు తగిన చర్యలు తీసుకోవాలని కుమార్ అన్నారు. హోటళ్లు, రెస్టారెంట్లు, బాంకెట్ హాల్స్, మాంసం దుకాణాలు వీధి కుక్కలను ఆకర్షించే విధంగా వీధుల్లో ఆహార వ్యర్థాలను వేయకుండా నిరోధించాలని నగర మున్సిపల్ అధికారులను ఆదేశించారు.
ప్రస్తుతం నగర పరిధిలో నివసిస్తున్న 5.7 లక్షల వీధికుక్కల్లో 4 లక్షల కుక్కలకు స్టెరిలైజ్ చేశారు. నిరంతర స్టెరిలైజేషన్ డ్రైవ్ల కారణంగా 2011లో 8.5 లక్షలుగా ఉన్న వీటి సంఖ్య ప్రస్తుతం 5.7 లక్షలకు తగ్గింది. నగరంలో పెంపుడు జంతువుల కోసం ప్రత్యేక మొబైల్ యాప్ రిజిస్ట్రేషన్ను అభివృద్ధి చేయాలని, దాని యజమానికి గుర్తింపు కార్డును జారీ చేయాలని శ్రీ కుమార్ అధికారులకు సూచించారు.
దీంతో పాటు కరపత్రాలు, హోర్డింగ్లు సిద్ధం చేయాలని, పాఠశాలలు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్కు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కుక్కలు సాధారణంగా మనుషులపై దాడి చేయవని పశువైద్య వైద్యులు అంటున్నారు, అయితే సంతానోత్పత్తి కాలంలో, వేసవిలో ఆహారం తక్కువగా ఉండటం వల్ల మగ కుక్కలు దూకుడుగా ఉంటాయని అన్నారు.
