తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే బుధవారం నుంచి నిరవధిక సమ్మెకు వెళ్తామని ఉద్యోగులు ప్రకటించారు. ఉద్యోగుల నిర్ణయంపై ప్రభుత్వం సీరియస్గా స్పందించింది. ఇప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్ ఉద్యోగులు సమ్మె ఆలోచనను మానుకోవాలని సూచించారు. అయితే తాజాగా సీఎం రేవంత్ రెడ్డి సైతం ఉద్యోగులకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆర్టీసీ ఉద్యోగులకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రం తీవ్ర ఆర్థిక ఒత్తిడిలో ఉన్నా, ప్రతి రూపాయిని జాగ్రత్తగా లెక్కలేసుకుంటూ పాలన కొనసాగిస్తున్నానని చెప్పారు. నెల తొలి తేదీకే వేతనాలు అందేలా చూస్తున్నామని, అయినా రోడ్డెక్కి సమ్మెలు, ధర్నాలు చేయడం సమంజసం కాదని ఆయన అన్నారు.
తాను ముఖ్యమంత్రి అయినా అనవసర ఖర్చులకు తావు ఇవ్వడంలేదని, స్పెషల్ ఫ్లైట్స్ వాడకుండానే సాధారణ ఎకానమీ క్లాస్లో ప్రయాణిస్తున్నానని వెల్లడించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజల నమ్మకాన్ని గౌరవంగా మోయాలని తానే తానుగా నియంత్రణ పాటిస్తున్నానన్నారు. రాష్ట్ర ఖజానాపై భారాన్ని తగ్గించేందుకు అన్ని మార్గాలు వెతుకుతున్నామని, ఇది ఓ వ్యక్తిగత బాధ్యత కాదని, ప్రతి ఉద్యోగి కూడా దీనికి సహకరించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్రం అభివృద్ధి పథంలో నిలబడాలంటే ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలు అర్థం చేసుకుని నడవాల్సిందేనన్నారు. లేదంటే వ్యవస్థే కుదేలయ్యే ప్రమాదముందని హెచ్చరించారు. పరిస్థితులు ఎలా ఉన్నా ఉద్యోగులకు జీతాలు ఇవ్వడంలో ఎలాంటి ఆలస్యం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, అయినా నిరసనలు, ఆందోళనలు కొనసాగిస్తే దాని ఫలితాల బాధ్యత ఉద్యోగులదేనని తేల్చిచెప్పారు. ఆర్టీసీ ఉద్యోగులకు సమ్మెకు వెళ్తామన్న నేపథ్యంలో రేవంత్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.