టీఆర్ఎస్ బహిరంగ సభలో పార్టీ సిద్ధాంత కర్త, కేసీఆర్ మార్గదర్శి ప్రొఫెసర్ జయశంకర్ ఫోటో కాదు కదా కనీసం ఆయనను స్మరించే కార్యకర్త కూడా కనిపించడం లేదు. అక్కడ కేసీఆర్ నిలువెత్తు ఫ్లెక్సీల ముందు తెలంగాణ తల్లి ఫొటో కూడా చిన్నదైపోయింది.  

టీఆర్ఎస్ పార్టీకి ఓ సిద్దాంతాన్ని, రూపాన్ని ఇచ్చిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సర్. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా కేసీఆర్ కు మార్గనిర్దేశనం చేసిన పెద్దాయన ఆయన.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

టీఆర్ఎస్ పార్టీ ఒడిదుడుకులు ఎదుర్కొన్న ప్రతీసారి జయశంకర్ సర్ ట్రబుల్ షూటర్ గా వ్యవహరించారు.

పార్టీలో చేరకుండానే పార్టీ ఎదుగుదల కోసం తద్వారా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం ఆహర్నిశలు శ్రమించారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతపై ఢిల్లీ పెద్దలకు కూడా ఆయన అర్ధమయ్యేలా చెప్పి ఒప్పించారు. భావసారుప్యం గల పార్టీలతో టీఆర్ఎస్ జతకట్టేలా చేశారు.

తన జీవితాంత తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే తపించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును చూడకుండానే మరణించారు.

తెలంగాణకు, పరోక్షంగా టీఆర్ఎస్ పార్టీకి ఇతోధికంగా సాయపడిన జయశంకర్ సర్ కు టీఆర్ఎస్ ఏం చేసింది.

పార్టీ 16 వసంతాలు పూర్తి చేసుకుంటున్న వేళ కనీసం ఆయనను స్మరించేందుకు కూడా ఇష్టపడటం లేదు.ప్రొఫెసర్ పుట్టిన పోరు నేల మీద సభ జరుగుతున్నా.... సర్ ఫొటో కాదు కదా కనీసం ఆయనను స్మరించే గులాబీ కార్యకర్త కూడా కనిపించడం లేదు.

ఇప్పుడు ఓరుగల్లు టీఆర్ఎస్ బహిరంగ సభలో ఎక్కడ చూసిన కేసీఆర్ ఫ్లెక్సీలే. ఆయన నిలువెత్తు ఫొటోల ముందు తెలంగాణ తల్లి ఫ్లెక్సీ కూడా చిన్నదైపోయింది. ఏదో మూలన కనికనిపించకుండా ఉండిపోతోంది.