మారుతీరావుకు విషం ఎక్కడిది, కాల్డేటాపై ఆరా
ప్రణయ్ హత్య కేసులో ఏ-1 నిందితుడు మారుతీరావు కాల్డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు. మిర్యాలగూడ పట్టణం నుండి హైద్రాబాద్కు వెళ్లే సమయంలో ఆయన విషం కొనుగోలు చేసినట్టుగా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
మిర్యాలగూడ:ప్రణయ్ హత్య కేసులో ఏ-1 నిందితుడు మారుతీరావు కాల్డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు. మిర్యాలగూడ పట్టణం నుండి హైద్రాబాద్కు వెళ్లే సమయంలో ఆయన విషం కొనుగోలు చేసినట్టుగా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు పోలీసులు డ్రైవర్ నుండి సమాచారాన్ని కూడ సేకరించినట్టుగా తెలుస్తోంది.
Also read:ప్రణయ్ కేసు: మారుతీరావు ఆస్తులు రూ. 200 కోట్లపైనే
ఈ నెల 7వ తేదీ సాయంత్రం మారుతీరావు డ్రైవర్ తో కలిసి హైద్రాబాద్కు వచ్చాడు. హైద్రాబాద్ కు వచ్చే ముందు మారుతీరావు ఓ ఫెర్టిలైజర్ షాపు ముందు కారును ఆపాలని డ్రైవర్ కు సూచించాడు.
మారుతీరావు ఆ ఫెర్టిలైజర్ నుండి తిరిగి వచ్చిన తర్వాత హైద్రాబాద్ కు చేరుకొన్నారు. ఈ షాపులోనే పురుగుల మందు లేదా ఇంకా ఏమైనా కొనుగోలు చేశారా అనే విషయంపై కూడ పోలీసులు ఆరా తీస్తున్నారు.
మారుతీరావు బస చేసిన ఆర్యవైశ్యభవన్ రూమ్ నెం.306లో కానీ ఆయన కారులో ఎలాంటి విషం సీసా లభ్యం కాలేదు. అయితే విషం కారణంగానే మారుతీరావు మృతి చెందినట్టుగా పోస్టుమార్టం నివేదిక తేల్చింది. అయితే ఈ విషం బాటిల్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
మారుతీరావు కాల్డేటాపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ నెల 7వ తేదీ రాత్రి 8:22 గంటలకు మారుతీరావు చివరి సారిగా పోన్ చేశారు. ఈ విషయాన్ని పోలీసులు గుర్తించారు. మల్లేపల్లిలో ఉండే తన న్యాయవాది వెంకటసుబ్బారెడ్డితో మారుతీరావు మాట్లాడినట్టుగా పోలీసులు గుర్తించారు.
ఈ నెల 8వ తేదీ ఉదయం 10 గంటలకు మారుతీరావు అడ్వకేట్ ను కలవాల్సి ఉంది. కానీ శనివారం నాడు రాత్రే మారుతీరావు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు పోస్టుమార్టం నివేదిక కూడ తేల్చింది.