హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరి పోలీసు స్టేషన్ పరిధిలో 8వ తరగతి చదువుతున్న బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతమైంది.

హైదరాబాద్: నగరంలోని మల్కాజ్‌గిరి పోలీసు స్టేషన్ పరిధిలో 8వ తరగతి చదువుతున్న బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. బాలుడి కిడ్నాప్ అయినట్టుగా ఫిర్యాదు అందడంతో స్పందించిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజ్‌, ఇతర వివరాలను ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. కారులో బాలుడిని కిడ్నాప్ చేసిన నలుగురు వ్యక్తులను రామన్నగూడెం వద్ద పోలీసులు పట్టుకున్నారు. బాలుడిని క్షేమంగా రక్షించి మల్కాజ్‌గిరి పోలీసు స్టేషన్‌కు తీసుకువస్తున్నారు. మరికాసేపట్లోనే బాలుడిని కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశం ఉంది. 

ఇక, మల్కాజిగిరిలోని తన ఇంటి దగ్గర నుంచి 8వ తరగతి బాలుడిని దుండగులు కిడ్నాప్ చేశారు. ఆడుకుందామని ఇంటి నుంచి వెళ్లిన బాలుడు రాత్రి వరకు కూడా తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు మల్కాజిగిరి పోలీసులను ఆశ్రయించారు. దీంతో కిడ్నాప్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాలుడి తండ్రి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండటంతో బాలుడి కిడ్నాప్‌పై పలు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. దీంతో పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. బాలుడి ఆచూకీ కనుగొనేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.