వరంగల్లో ఆత్మహత్యాయత్నం చేసిన మెడికల్ విద్యార్ధిని ప్రీతి ఆసుపత్రిలో మృత్యువుతో పోరాటం చేస్తోంది. మరోవైపు ఆమెను వేధించిన సైఫ్ను కాలేజ్ నుంచి సస్పెండ్ చేస్తూ కేఎంసీ నిర్ణయం తీసుకుంది.
వరంగల్లో ఆత్మహత్యాయత్నం చేసిన వైద్య విద్యార్ధిని ప్రీతికి సంబంధించి అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ప్రీతి ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. అటు ఆమెను వేధించిన సీనియర్ సైఫ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. మరోవైపు సైఫ్కు శిక్ష పడే అవకాశాలు వుండటంతో అతనికి మద్ధతుగా పీజీ విద్యార్ధులు ఆందోళన బాట పట్టారు. శుక్రవారం ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్ను కలిసి విధులు బహిష్కరిస్తున్నట్లు నోటీసులు ఇచ్చారు. అయితే రోగుల చికిత్స, ఇతర కారణాలను దృష్టిలో వుంచుకుని విధులకు హాజరుకావాలని ఆయన నచ్చజెప్పారు.
ఇదే సమయంలో వరంగల్ సీపీ రంగనాథ్ రంగంలోకి దిగారు. సైఫ్ ఉద్దేశ్యపూర్వకంగా ప్రీతిని వేధించినట్లు ఆధారాలు సేకరించినట్లు ఆయన తెలిపారు. దీంతో పీజీ విద్యార్ధులు తమ నిరసనను విరమించి విధుల్లో చేరారు. అయితే నల్ల బ్యాడ్జిలు ధరించి ఆందోళన నిర్వహిస్తున్నారు. ఇకపోతే.. ప్రీతిని వేధించిన సైఫ్ను కాలేజ్ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది యాజమాన్యం . అలాగే శిక్ష పడితే కాలేజ్ నుంచి బహిష్కరణ వేటు వేస్తామని తెలిపింది. ప్రీతి కేసుకు సంబంధించి వైద్యుల బృందం విచారణ పూర్తి చేసింది. అనంతరం నివేదికను శనివారం సీల్డ్ కవర్లో డీఎంఈకి అందజేసింది. ఎంసీఐకి కూడా ఇదే నివేదికను పంపింది.
ALso REad: వరంగల్ మెడికో కేసు.. ప్రీతిని వేధించిన సైఫ్పై సస్పెన్షన్ వేటు, నేరం రుజువైతే బహిష్కరణే
ఇటీవల కాకతీయ మెడికల్ కాలేజ్లో పీజీ ఫస్టియర్ చదువుతున్న ప్రీతి ఆత్మహత్యకు యత్నించిన ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. జనగామ జిల్లాకు చెందిన ప్రీతి.. వరంగల్లోని కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ (అనస్థీషియా) చదువుతోంది. మహాత్మాగాంధీ మెమోరియల్ (ఎంజీఎం) ఆస్పత్రిలో శిక్షణలో ఉన్న సమయంలో ఉదయం 6:30 గంటల ప్రాంతంలో విషపూరిత ఇంజక్షన్ వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. ప్రీతిని అపస్మారక స్థితిలో ఉండటం గమనించిన ఆసుపత్రి సిబ్బంది సీనియర్ వైద్యులక సమాచారం అందించారు. వారు ఆమెను అత్యవసర వార్డుకు తరలించి చికిత్స అందించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని నిమ్స్కు తరలించారు.
ఇక, సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపుల కారణంగానే ఆమె ఆత్మహత్య యత్నంచినట్టుగా పోలీసులు గుర్తించారు. సైఫ్పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు ర్యాగింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసినట్టుగా పోలీసులు చెప్పారు. ఈ క్రమంలోనే సైఫ్ను అదుపులోకి తీసుకున్నట్టుగా పోలీసులు ప్రకటించారు. శుక్రవారం సైఫ్ను హన్మకొండలోని కోర్టులో హాజరుపరచగా.. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం సైఫ్ను ఖమ్మం జైలుకు తరలించారు.
మరోవైపు.. నిమ్స్లో చికిత్స పొందుతున్న పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఈ రోజు ఉదయం విడుదల చేసిన హెల్త్ బులిటెన్లో.. ప్రీతి ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని తెలిపారు. ఎక్మో సపోర్టుతో వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నామని చెప్పారు. శుక్రవారం సీపీఆర్ నిర్వహించి గుండె పనితీరును మెరుగుపరిచినట్టుగా తెలిపారు. వైద్యుల బృందం పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు.
