గోగినేనిని వదిలేసి, మహేష్ కత్తిని బహిష్కరిస్తారా: పరిపూర్ణానంద
వేంకటేశ్వర సుప్రభాతాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బాబు గోగినేనిని వదిలేసి, శ్రీరాముడిపై వ్యాఖ్యలు చేసిన మహేష్ కత్తిని బహిష్కరిస్తారా అని పరిపూర్ణానంద ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వాన్ని లక్ష్యం చేసుకుని ఆయన విమర్శలు చేశారు.
కాకినాడ: సినీ క్రిటిక్ మహేష్ కత్తికి శ్రీపీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద బాసటగా నిలిచారు. మహేష్ కత్తిని బహిష్కరించడం సరి కాదని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని లక్ష్యం చేసుకుని ఆయన విమర్శనాస్త్రాలు సంధించారు. తనకు బహిష్కరణ విధించడంపై ఆయన మండిపడ్డారు.
సంఘ విద్రో హ శక్తిగా పేర్కొంటూ తనను బహిష్కరించడం ఎంతవరకూ సమంజసమని ఆయన అడిగారు. తాను 300 గ్రామాలను దత్తత తీసుకుని, వెనకబడ్డ ప్రాంతాలలోని పిల్లలకు సంధ్యా గురుకులం పేరిట దేశభక్తిని అందిస్తున్నానని, వందలాది గోవులు, గిత్తలు రైతులకు దానం చేసి గోఆధారిత వ్యవసాయానికి సాయపడుతున్నానని ఆయన చెప్పుకున్నారు.
అటువంటి తనను సంఘ విద్రోహశక్తిగా పేర్కొనడం తెలంగాణ ప్రభుత్వ విజ్ఞతకే వదిలేస్తున్నట్లు ఆయన తెలిపారు. కాకినాడ శ్రీపీఠంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ విధమైన చర్యలతో తన ధర్మపోరాటం ఆగిపోదని, దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాల్లో హిందూ ధర్మపరిరక్షణ కోసం కృషి చేస్తానని చెప్పారు
హిందూ మతంపై అనుచిత వ్యాఖ్యలు, దూషిస్తూ పుస్తకాలు రాసిన వారిపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం విచారకరమని ఆయన అన్నారు. వేంకటేశ్వరస్వామి, సుప్రభాతాలపై బాబు గోగినేని పలు అనుచిత వ్యాఖ్యలు చేసినా తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోలేదని, కత్తి మహేశ్కు మాత్రం బహిష్కరణ విధించిందని ఆయన అన్నారు. అనుచిత వ్యాఖ్యలకు దారితీసిన పరిస్థితులను గుర్తించాలని ఆయన అన్నారు.