తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌కి పంజాగుట్ట పోలీసులు నోటీసులు జారీ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సంజయ్‌కు నోటీసులు ఇచ్చారు. 

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌కి పంజాగుట్ట పోలీసులు నోటీసులు జారీ చేశారు. సోమవారం విచారణకు రావాల్సిందిగా ఆయన నోటీసుల్లో పేర్కొన్నారు. కవితపై అనుచిత వ్యాఖ్యలకు గాను బండి సంజయ్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కొద్దిరోజుల క్రితం పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా సంజయ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణకు రావాల్సిందిగా నోటీసులు ఇచ్చారు. పంజాగుట్టతో పాటు తెలంగాణ వ్యాప్తంగా అనేక పోలీస్ స్టేషన్‌లలో సంజయ్‌పై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. 

ఇక ఇదే వ్యవహారంపై తెలంగాణ మహిళా కమీషన్ సైతం సంజయ్‌కి నోటీసులు ఇచ్చింది. దీంతో ఆయన నిన్న కమీషన్ ముందుకు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను తప్పు చేయలుదు కాబట్టే కమీషన్ ముందు హాజరయ్యానని స్పష్టం చేశారు. అంబర్‌‌పేటలో కుక్క కాటుకు బాలుడు మృతి, సికింద్రాబాద్ అగ్నిప్రమాదం అన్నింటికి మినిస్టర్ కేటీఆరేనని దీనిపై ఆయన స్పందించరా అని సంజయ్ ప్రశ్నించారు. కవితపై కేసుకు సంబంధించి తెలంగాణలో వున్న ఒక సామెతను మాత్రమే వాడాననని ఆయన పేర్కొన్నారు. కవిత విషయంలో తాను తప్పుగా మాట్లాడలేదని సంజయ్ పేర్కొన్నారు. 

Also REad: కవితను నేను ఏం అనలేదు.. మన దగ్గర వాడుకలో వున్న సామెతనే వాడా : బండి సంజయ్

పేపర్ లీక్‌కు సంబంధించి ఇప్పటి వరకు పిల్లలకు భరోసా కల్పించే పనిచేయలేదని ఆయన మండిపడ్డారు. కమీషన్‌ను గౌరవించాల్సిన బాధ్యత వుందని.. తాను ఎవరిని కించపరచలేదని సంజయ్ స్పష్టం చేశారు. పేపర్ లీక్ కేసులో ప్రధాన నిందితురాలైన రేణుక కుటుంబ సభ్యులు బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారేనని ఆయన తెలిపారు. ఈ కేసులో బీజేపీకి సంబంధమున్న చెబుతున్నవారు, రాజశేఖర్ రెడ్డి ఇన్నాళ్లు దొంగతనం చేస్తుంటే ఏం చేశారని బండి సంజయ్ నిలదీశారు. 

ఇక, ఇటీవల బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. కవిత అరెస్ట్ అంశాన్ని ప్రస్తావించే క్రమంలో.. ‘కవితని అరెస్ట్ చేయకుండా ముద్దు పెట్టుకుంటారా…’ అంటూ బండి సంజయ్ కామెంట్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కవిత వికెట్ పడిపోయిందని.. అతి త్వరలో బీఆర్ఎస్‌లో మరికొంతమంది క్లీన్ బౌల్డ్ అవుతారని అన్నారు. మద్యం కుంభకోణం, గ్యాంబ్లింగ్ కార్యకలాపాలకు పాల్పడిన వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని చెప్పారు. అయితే కవితపై బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని.. వెంటనే క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి.