Gali Janardhan Reddy: ఓబుళాపురం అక్రమ తవ్వకాల కేసులో గాలి జనార్ధన్ రెడ్డికి ఏడేళ్ల జైలు శిక్షను విధించింది నాంపల్లి సీబీఐ కోర్టు. ప్రభుత్వానికి రూ.884 కోట్ల నష్టానికి కారణమైన ఈ మైనింగ్ కేసు 15 ఏళ్లుగా విచారణలో నడిచింది.

Obulapuram Mining Case: 15 ఏళ్ల పాటు సాగిన దేశంలోని అత్యంత హైప్రొఫైల్ అవినీతి కేసుల్లో ఒకటైన ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (OMC) అక్రమ మైనింగ్ కేసులో, నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టు మంగళవారం తుది తీర్పు ప్రకటించింది. కోర్టు ఐదుగురు వ్యక్తులను దోషులుగా తేల్చగా, ఇద్దరిని నిర్దోషులుగా విడుదల చేసింది. 

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (OMC) అక్రమ తవ్వకాల కేసులో ముగ్గురు ప్రముఖులను ఏడేళ్ల కఠిన శిక్షకు దోషులుగా ప్రకటించింది. కేసులో ప్రధాన నిందితుడు, కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి, OMC మేనేజింగ్ డైరెక్టర్ బివి శ్రీనివాస రెడ్డి, అలాగే మాజీ మైన్స్ అండ్ జియాలజీ డైరెక్టర్ వీడి రాజగోపాల్, గాలి వ్యక్తిగత సహాయకుడు మెఫూజ్ అలీ ఖాన్‌లకు ఏడేళ్ల కఠిన శిక్ష విధించారు. ఓబుళాపురం మైనింగ్ కంపెనీపై రూ.2 లక్షల జరిమానా, ప్రతి దోషిపై రూ.10,000 జరిమానా విధించారు.

ఏంటి ఈ ఓబుళాపురం మైనింగ్ కేసు? 

ఓబుళాపురం అక్రమ తవ్వకాల కేసు అంటే, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి ఆధ్వర్యంలోని ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (OMC) గణనీయమైన పరిమితుల్ని ఉల్లంఘించి, అధికంగా ఇనుము ఖనిజాన్ని తవ్వి, ప్రభుత్వానికి భారీ ఆర్థిక నష్టాన్ని కలిగించిన అవినీతి వ్యవహారం. 

ఈ కేసు 2009లో ప్రారంభమై, దాదాపు 15 ఏళ్లపాటు న్యాయపోరాటం సాగింది. మొత్తం 3,337 పత్రాలు, 219 సాక్షులను పరిశీలించిన కోర్టు, దోషులపై ఐపీసీ సెక్షన్లు 120బీ (క్రిమినల్ కుట్ర), 420 (మోసం), 409 (అమానత ద్రోహం), 468 & 471 (నకిలీ పత్రాలు), అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు 13(2) & 13(1)(డీ) కింద తీర్పు వెలువరించింది. 

వీడి రాజగోపాల్‌కు మరో నాలుగేళ్ల అదనపు శిక్షను అవినీతి నిరోధక చట్టం కింద విధించడంతో, మొత్తం 11 ఏళ్ల శిక్ష ఖరారైంది. ఆయన తన అధికార పదవిని దుర్వినియోగం చేసి అక్రమ తవ్వకాలకు సహకరించారని కోర్టు పేర్కొంది. ఇక మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, అప్పటి పరిశ్రమల కార్యదర్శి బి. కృపానందం నిర్దోషులుగా తేలారు. IAS అధికారి వై. శ్రీలక్ష్మిని 2022లోనే తెలంగాణ హైకోర్టు ఈ కేసు నుంచి విడుదల చేసింది. మరో నిందితుడు లింగా రెడ్డి విచారణ సమయంలో మరణించాడు.

ఈ కేసు వై.ఎస్. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మొదలైంది. దాంతోపాటు, ఓబుళాపురం ప్రాంతంలోని 68.5 హెక్టార్లు, 39.5 హెక్టార్ల లీజులను OMCకు ప్రాధాన్యతతో కేటాయించినట్టు CBI తెలిపింది. ధీహిరేహల్, రాయదుర్గం మండలాల్లోని భూములను 23 మంది దరఖాస్తుదారులను కాదని OMCకు కేటాయించినట్లు వెల్లడైంది. అలాగే, రెడ్డి అండ్ కో ఈ మంజూరు అయిన లీజు భూభాగాలను మించిపోయి, కర్ణాటక అటవీ ప్రాంతాలలో కూడా తవ్వకాలు జరిపారు. దీని ద్వారా సుమారు రూ.884.13 కోట్లు నష్టం ప్రభుత్వానికి జరిగింది.

సుమారు 60 మెట్రిక్ టన్నుల ఇనుము ఖనిజాన్ని విదేశాలకు బినామీ మార్గాల ద్వారా ఎగుమతి చేసినట్లు CBI ఛార్జ్‌షీట్ పేర్కొంది. 2007లో, పరిశ్రమల కార్యదర్శి శ్రీలక్ష్మి, కేటాయింపు తీర్మానాన్ని స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు అవసరమని సిఫారసు చేయగా, అదే రోజే ప్రభుత్వ ఉత్తర్వు వెలువడింది. ఇది నిబంధనలకు విరుద్ధంగా ఉండటమే కాకుండా, OMCకు ఖనిజాన్ని విక్రయించే హక్కు ఇచ్చినట్లయింది. ఇలా భారీ స్థాయిలో అక్రమ తవ్వకాలు, నిబంధనల ఉల్లంఘనలు జరిగి, రూ.884.13 కోట్లు ప్రభుత్వానికి నష్టం వాటిల్లిందని సీబీఐ తేల్చడంతో చివరకు ఈ కేసులో కోర్టు శిక్షలు ఖరారు చేసింది.