నాందేడ్ నుంచి హైదరాబాద్కు వచ్చి చోరీలు.. ఓ దొంగ అరెస్టు.. 150 గ్రాముల బంగారం స్వాధీనం
హైదరాబాద్లో నాందేడ్ నుంచి వచ్చి దొంగతనం చేసిన ఓ చోరుడిని మీర్ పేట్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 150 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బడంగ్పేట్ ఎక్స్ రోడ్ దగ్గర ఈ అరెస్టు జరిగింది.
హైదరాబాద్: నాందేడ్ నుంచి ట్రైన్లో హైదరాబాద్కు వస్తారు. టూ వీలర్పై నగరాన్ని జల్లెడ పడతారు. తాళం వేసి ఉన్న ఇంటిని టార్గెట్ చేసుకుంటారు. డోర్ తాళం పగులగొట్టి లోపలికి వెళతారు. అల్మారానూ ధ్వంసం చేస్తారు. వస్తువులను చిందర వందరగా విసిరేస్తారు బంగారం, డబ్బు, ఇతర విలువైన వస్తువులు కనిపించగానే పట్టుకుని బయట పడతారు. బస్సులో మళ్లీ నాందేడ్కు తిరిగి వెళ్లిపోతారు. ఈ చేయి తిరిగిన దొంగలను హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. గురువారం ఇందులో ఓ దొంగను బడంగ్పేట్ ఎక్స్ రోడ్ దగ్గర అరెస్టు చేశారు.
మహారాష్ట్ర నాందేడ్కు చెందిన షేక్ అమీర్ బైక్ మెకానిక్. అమీర్ పలుమార్లు దొంగతనాలు చేశాడు. పోలీసులకు పట్టుబడ్డాడు. వాహనాల దొంగతనాలు, ఇంటిలో చోరీలకు పాల్పడ్డాడు. ఈ ఏడాది మే నెలలో షేక్ అమీర్.. షేక్ అవీజ్తోపాటు జైలు నుంచి విడుదలయ్యాడు. బయటకు వచ్చాక వీరు లిక్కర్ తాగడం, గుట్కా నమలడం, పొగ తాగడం వంటి దుర్వ్యసనాలకు లోనయ్యారు. ఆ తర్వాత ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడంతో దొంగతనానికి స్కెచ్ వేశారు. మీర్పేట్ పోలీసు స్టేషన్ పరిధిలో వీరు ఒక ఇంటిలో దొంగతనం చేశారు.
షేక్ అమీర్, షేక్ అవీజ్లు ట్రైన్లో నాందేడ్ నుంచి హైదరాబాద్కు వచ్చారు. నాంపల్లిలో ఓ లాడ్జీలో దిగారు. మధ్యాహ్నం పూట బజాజ్ పల్సర్ పై కాలనీల్లో తిరిగారు. తాళం వేసి ఉన్న ఓ ఇంటిని చూశారు. మెయిన్ డోర్ తాళం పగులగొట్టి లోనికి వెళ్లారు. అల్మారా ఓపెన్ చేసి బంగారం, వెండి ఆభరణాలు, డబ్బును దొంగిలించారు. తర్వాత వాారు నాందేడ్కు బస్సులో వెళ్లిపోయారు.
పోలీసులు షేక్ అమీర్ను అరెస్టు చేశారు. షేక్ అవీజ్ మాత్రం పరారీలో ఉన్నాడు. వారి నుంచి పోలీసులు 150 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం రూ. 7.9 లక్షల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఒక ఐరన్ రాడ్, ఒక స్క్రూ డ్రైవర్ కూడా లభించింది.