వైద్య విద్యార్ధిని ప్రీతి ఆరోగ్య పరిస్ధితిపై నిమ్స్ వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఆమె ఆరోగ్యం అత్యంత విషమంగా వుందని .. వెంటిలేటర్పై వుంచి, ఎక్మోపైనే చికిత్స అందిస్తున్నామని నిమ్స్ వైద్యులు తెలిపారు
ఆత్మహత్యాయత్నం చేసిన మెడికల్ విద్యార్ధిని ప్రీతి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా వుందని నిమ్స్ వైద్యులు తెలిపారు. ఈ మేరకు గురువారం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ప్రీతి మల్టీ ఆర్గాన్స్ పూర్తిగా ఫెయిల్ అయ్యాయని.. వెంటిలేటర్పై వుంచి, ఎక్మోపైనే చికిత్స అందిస్తున్నామని నిమ్స్ వైద్యులు తెలిపారు. ఎక్మో, సీఆర్ఆర్పీ ద్వారా కిడ్నీ ఫంక్షన్ చేయిస్తున్నామని డాక్టర్లు వెల్లడించారు. ఇప్పటికీ ప్రీతి పరిస్థితి అత్యంత విషమంగానే వుందని తెలిపారు.
ఇక, జనగామ జిల్లాకు చెందిన ప్రీతి.. వరంగల్లోని కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ (అనస్థీషియా) చదువుతోంది. మహాత్మాగాంధీ మెమోరియల్ (ఎంజీఎం) ఆస్పత్రిలో శిక్షణలో ఉన్న సమయంలో బుధవారం ఉదయం 6:30 గంటల ప్రాంతంలో విషపూరిత ఇంజక్షన్ వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. ప్రీతిని అపస్మారక స్థితిలో ఉండటం గమనించిన ఆసుపత్రి సిబ్బంది సీనియర్ వైద్యులక సమాచారం అందించారు. వారు ఆమెను అత్యవసర వార్డుకు తరలించి చికిత్స అందించారు.
Also REad: వరంగల్ ప్రీతి కేసు : సైఫ్ అరెస్ట్ .. పోలీసుల చేతికి కీలక వాట్సాప్ ఛాట్, మరిన్ని ఆధారాలు
దీనిపై ప్రీతి సహవిద్యార్థులు కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్ దాస్, ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్లకు సమాచారం అందించారు. ఈ ఘటనపై అప్రమత్తమైన వెంటనే డాక్టర్ ప్రీతిని వెంటిలేటర్పై ఉంచి సీటీ స్కాన్తో పాటు అన్ని పరీక్షలు నిర్వహించామని ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్ తెలిపారు. పీజీ విద్యార్థి శరీరంపై తమకు ఇంజక్షన్ గుర్తు కనిపించలేదని చెప్పారు. ఇదిలా ఉంటే.. ప్రీతిని మెరుగైన వైద్యం కోసం వరంగల్ నుంచి హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రీతి పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు చెబుతున్నాయి.
సీనియర్ విద్యార్థి వేధింపుల వల్లే ప్రీతి ఆత్మహత్యకు యత్నించిందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. అయితే సీనియర్ విద్యార్థుల ర్యాగింగ్ ఆరోపణలను కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్ దాస్ తోసిపుచ్చారు. సీనియర్ విద్యార్థులు డాక్టర్ ప్రీతిని ఎప్పుడూ ర్యాగింగ్ చేయలేదని.. అయితే ఆమె విధులను సక్రమంగా నిర్వర్తించడం గురించి హెచ్చరించినట్లు చెప్పారు. ఇక, ప్రీతి తండ్రి నరేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసు అధికారులు ఆత్మహత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
