పీఎఫ్ఐ కేసులో దూకుడు.. చంచల్గూడ జైలు నుంచి నలుగురిని కస్టడీలోకి తీసుకున్న ఎన్ఐఏ..
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) వేగం పెంచింది. ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతం హైదరాబాద్లోని చంచల్గూడ జైలులో ఉన్న నలుగురు పీఎఫ్ఐ సభ్యులను ఎన్ఐఏ అధికారులు శనివారం కస్టడీలోకి తీసుకుంది.
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) వేగం పెంచింది. ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతం హైదరాబాద్లోని చంచల్గూడ జైలులో ఉన్న నలుగురు పీఎఫ్ఐ సభ్యులను ఎన్ఐఏ అధికారులు శనివారం కస్టడీలోకి తీసుకుంది. చంచల్గూడ సెంట్రల్ జైలు నుంచి జాహిద్, సమీయుద్దీన్, మాజ్ హుస్సేన్, కలీమ్లను అదుపులోకి తీసుకున్న అధికారులు.. విచారణ నిమిత్తం నిందితులను మాదాపూర్లోని ఎన్ఐఏ కార్యాలయానికి తరలించారు. ఇక, నిందితులపై గతేడాది ఎన్ఐఏ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
ముస్లిం యువతను రాడికలైజ్ చేసి వారికి శిక్షణ ఇస్తున్నారనే ఆరోపణలపై గతేడాది తెలంగాణలోని పలు ప్రాంతాల నుంచి 20 మందికి పైగా పీఎఫ్ఐ సభ్యులను అధికారులు అరెస్టు చేశారు. ఐదుగురు పీఎఫ్ఐ సభ్యులపై ముస్లిం యువకులను రెచ్చగొట్టడం, రాడికలైజ్ చేయడం, వారిని రిక్రూట్ చేయడం, ప్రత్యేకంగా నిర్వహించిన శిక్షణా శిబిరాల్లో ఆయుధ శిక్షణ ఇవ్వడం వంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఎన్ఐఏ పేర్కొంది. షేక్ రహీం, షేక్ వహైద్ అలీ, జఫ్రుల్లా ఖాన్ పఠాన్, షేక్ రియాజ్ అహ్మద్, అబ్దుల్ వారిస్లకు వ్యతిరేకంగా నేరపూరిత కుట్ర, మతం ఆధారంగా వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం, కఠినమైన చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టంలోని నిబంధనల ప్రకారం అభియోగాలు మోపింది
ఇక, వివిధ రాష్ట్రాల పోలీసులు, జాతీయ ఏజెన్సీలు జరిపిన పరిశోధనలలో పీఎఫ్ఐ హింసాత్మక కార్యకలాపాలకు పాల్పడినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో పీఎఫ్ఐ, దాని అనుబంధ సంస్థలను 2022 సెప్టెంబర్ లో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ చట్టవిరుద్ధమైన సంఘంగా ప్రకటించింది.