సింగరేణిలో కొత్త ఉత్కంఠ
- ముగిసిన పోలింగ్
- 96 శాతానికి చేరిన పోలింగ్
- గతం కంటే పెరిగుదల
- 9 గంటలకు కౌంటింగ్ షూరు
- 10 గంటల తర్వాతే ఫలితాల వెలువడే అవకాశం
సింగరేణి ఎన్నికలు ముగిశాయి. ఈసారి పోలింగ్ భారీగా నమోదైంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ఉదయం నుంచి కూడా కార్మికులు ఉత్సాహంగా ఓటింగ్ లో పాల్గొన్నారు.
సాయంత్రం 4 గంటల వరకు 94 శాతం నమోదు కాగా మిగిలిన గంటలోనే మరో 2శాతం పోలింగ్ నమోదైంది.
గతంతో పోలిస్తే ఈ ఏడాది పోలింగ్ శాతం పెరిగింది. గతంలో 94 శాతం నమోదైన పరిస్థితి ఉందగా ఈ ఏడాది మాత్రం 96కు చేరింది.
పోలింగ్ ముగిసిన నేపథ్యంలో గెలుపుపై ఎవరి అంచనాల్లో వారు తలమునకలవుతున్నారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో జాతీయ సంఘాలన్నీ ఏకమై ఈ ఎన్నికల్లో పోటీకి తలపడ్డాయి. ఎఐటియుసి నాయకత్వంలో ఐఎన్ టియుసి, టిఎన్ టియుసి కలిసి పోటీ చేస్తుండగా తెలంగాణలో అధికార పార్టీ అనుబంధ సంఘమైన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఒంటరి పోరు సాగిస్తోంది.
బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరిగినందున సాయంత్రం 7 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలు కానుంది. అయితే రాత్రి 10 గంటల దాటిన తర్వాతే తుది ఫలితాలు వెలువడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
ఏది ఏమైనా పోలింగ్ ప్రశాంతంగా సాగడంతో కౌంటింగ్ ప్రక్రియపై అన్ని వర్గాలు దృష్టి సారించాయి. ఈ ఎన్నికలను టిఆర్ఎస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 11 డివిజన్లలో నాలుగు జిల్లాల్లో ఈ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో రానున్న సార్వత్రిక ఎన్నికల మీద ప్రభావం చూపుతాయని భావిస్తున్నారు.
ఎంపి కవిత తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గెలుపు బాధ్యతలు భుజాన వేసుకున్నారు.
అయితే మరోవైపు జాతీయ సంఘాలు తమదే విజయం అంటూ ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది.