షర్మిలకు బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్ట్.. న్యాయమే గెలిచిందన్న విజయమ్మ
వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలకు నాంపల్లి కోర్ట్లో ఊరట లభించింది. ఆమెతో పాటు మరో ఐదుగురికి బెయిల్ మంజూరు చేస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలకు నాంపల్లి కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. వ్యక్తిగత పూచీకత్తుపై ఆమెతోపాటు మరో ఐదుగురు వ్యక్తులకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. దీనిపై షర్మిల తల్లి వైఎస్ విజయమ్మ స్పందించారు. చివరికి న్యాయమే గెలుస్తుందని ఆమె అన్నారు. పై నుంచి ఆదేశాలు వున్నందునే పోలీసులు ఇలా చేశారని విజయమ్మ పేర్కొన్నారు. పాదయాత్రలో షర్మిల త్వరలోనే పాల్గొంటారని ఆమె స్పష్టం చేశారు. వైఎస్ రక్తం దేనికీ భయపడదని విజయమ్మ వ్యాఖ్యానించారు.
కాగా... నిన్న నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గంలోని లింగగిరిలో వైఎస్ షర్మిలకు చెందిన బస్సుపై టీఆర్ఎస్ శ్రేణులు నిప్పు పెట్టారు. అంతే కాదు షర్మిల పార్టీకి చెందిన వాహనాలపై దాడి చేశారు . ఈ ఘటనలో నాలుగు వాహానాలు ధ్వంసమయ్యాయి. టీఆర్ఎస్ శ్రేణుల దాడిని వైఎస్ఆర్టీపీ శ్రేణులు అడ్డుకొనే ప్రయత్నం చేశాయి. ఈ క్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేసి హైద్రాబాద్ కు తీసుకు వచ్చి రాత్రి లోటస్ పాండ్లో వదిలి వెళ్లిపోయారు.
ALso Read:కారు దిగనన్న షర్మిల.. క్రేన్తో లిఫ్ట్ చేసి పీఎస్కు తరలింపు (ఫోటోలు)
అయితే నర్సంపేటలో టీఆర్ఎస్ శ్రేణుల దాడికి నిరసనగా ఇవాళ ప్రగతి భవన్ ను ముట్టడించాలని వైఎస్ఆర్టీపీ తలపెట్టింది. పోలీసుల కళ్లుగప్పి షర్మిల లోటస్ పాండ్ నుండి బయటకు వెళ్లారు. సోమాజీగూడ నుండి ధ్వంసమైన కారుతో ప్రగతి భవన్ వైపునకు వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు పంజాగుట్టలో షర్మిలను అడ్డుకున్నారు. అయితే కారులో నుండి దిగకుండా ఆమె నిరసనకు దిగారు. ప్రగతి భవన్ కు తాను వెళ్లేందుకు అనుమతించాలని కోరారు. కారు అద్దాలు కూడా దించలేదు. దీంతో పోలీసులు క్రేన్ సహాయంతో కారుతో సహా షర్మిలను ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చిన తర్వాత కూడా ఆమె కారు నుండి దిగలేదు. దీంతో కారు డోర్ లాక్స్ ఓపెన్ చేసి షర్మిలను ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లోనికి తీసుకెళ్లారు పోలీసులు. మరోవైపు షర్మిలకు మద్దతుగా వచ్చిన వైఎస్ఆర్టీపీ శ్రేణులు, షర్మిల అభిమానులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.