Asianet News TeluguAsianet News Telugu

నా అన్నతో పంచనామాపై బలవంతంగా సంతకం పెట్టించారు.. ఐటీ అధికారులపై భద్రారెడ్డి ఫిర్యాదు...

కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి ఇళ్లల్లో జరుగుతున్న సోదాల్లో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. మల్లారెడ్డి పెద్ద కొడుకు మహేందర్ రెడ్డితో పంచనామా మీద బలవంతంగా సంతకం పెట్టించారంటూ కేసు నమోదయ్యింది. 

My brother were forced to sign the panchanama, Bhadra Reddy's complaint against the IT officials, hyderabad
Author
First Published Nov 25, 2022, 7:20 AM IST

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి నివాసాల్లో ఐటీ దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆయన బంధువులు, కుటుంబ సభ్యులు, వ్యాపార భాగస్వాములపై జరిగిన  ఐటీ దాడులు జరుపుతోంది. ఈ అంశంలో ఓ కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. ఐటీ శాఖ డిప్యూటీ డైరెక్టర్ సి.ఎం.డి రత్నాకర్ పై మల్లారెడ్డి చిన్న కొడుకు భద్రారెడ్డి ఆరోపణలు గుప్పించారు. ఐటీ దాడులకు సంబంధించిన పంచనామాపై ఆస్పత్రిలో ఉన్న తన అన్న మహేందర్ రెడ్డితో  రత్నాకర్ బలవంతంగా సంతకం పెట్టించుకున్నారంటూ భద్రారెడ్డి బోయిన్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

మరోవైపు రత్నాకర్ కూడా మల్లారెడ్డి అతని అనుచరులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంత్రి మల్లారెడ్డి తనను పనిచేసుకోనివ్వకుండా.. తన విధులను అడ్డుకున్నాడని.. దీంతో పాటు కీలక పత్రాలను నాశనం చేశారని ఆ ఫిర్యాదులో ఆరోపించారు. ఈ మేరకు బోయిన్పల్లి పోలీసులు కేసులు నమోదు చేసుకున్నారు. తదుపరి దర్యాప్తు నిమిత్తం ఈ కేసులను దుండిగల్ పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు.

నా అన్న మహేందర్రెడ్డిని బెదిరించారు…
ఐటీ సోదాల నేపథ్యంలో  మల్లారెడ్డి పెద్ద కొడుకు మహేందర్రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఆయన మల్లారెడ్డి నారాయణ ఆసుపత్రిలో చేరి, చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే, బుధవారం రాత్రితో మహేందర్ రెడ్డి ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు పూర్తయ్యాయి. దీంతో ఈ సోదాలకు సంబంధించి అధికారులు..పంచనామా రూపొందించారు. డిప్యూటీ డైరెక్టర్ రత్నాకర్  ఈ పంచనామాపై సంతకం చేయించుకోవడానికే ఆస్పత్రికి వెళ్లారు. ఇదిలా ఉంటే.. గుండెనొప్పితో చికిత్స తీసుకుంటున్న తన అన్న మహేందర్రెడ్డిని డిప్యూటీ డైరెక్టర్ రత్నాకర్ బెదిరించారని, పంచనామాపై బలవంతంగా సంతకాలు తీసుకున్నారని... మల్లారెడ్డి చిన్న కొడుకు భద్రారెడ్డి మండిపడ్డారు. 

లాకర్ల తాళాలను తీసుకెళ్లిన ఐటీ అధికారులు... డొనేషన్లపైనే అనుమానాలు, సోమవారం మల్లారెడ్డికి పిలుపు

భద్రారెడ్డి  సీఎంఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ, మల్లారెడ్డి సొసైటీల అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ మేరకు భద్రారెడ్డి  బుధవారం అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ పిర్యాదు ఆధారంగా పోలీసులు రత్నాకర్ మీద ఐపీసీ 384 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. మరోవైపు రూ. 100 కోట్ల డొనేషన్ లకు సంబంధించిన పత్రాలపై కూడా మహేందర్ రెడ్డి సంతకాలు ఐటీ అధికారులు తీసుకున్నట్లు సమాచారం. అయితే, తమ వద్ద రూ.100 కోట్లు లేవని, మేనేజ్మెంట్ కోటా లేనప్పుడు డొనేషన్ ఎలా ఇస్తారని మీడియాతో మాట్లాడుతూ మంత్రి మల్లారెడ్డి ప్రశ్నించారు. 

ఇదిలా ఉండగా.. రత్నాకర్ మరోవైపు..తాను మహేందర్ రెడ్డితో పంచనామాపై సంతకం చేయించుకోవడానికి ఆసుపత్రికి వెళ్ళినప్పుడు.. ఆ సమయంలో అక్కడికి మంత్రి మల్లారెడ్డి తన అనుచరులతో కలిసి వచ్చారని.. తన విధులకు ఆటంకం కలిగించారని  గురువారం తెల్లవారుజామున 3.40 గంటలకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో పంచనామాతో పాటు మరికొన్ని పత్రాలు చించేశారని, అసభ్య పదజాలంతో దూషించారని తెలిపారు. తనను బెదిరించారని పేర్కొన్నారు. 

తన రెండు బ్యాగులు దొంగిలించారని.. వీటిల్లో ల్యాప్టాప్, హార్డ్ డ్రైవ్స్ ఉన్నాయని ఆరోపించారు. రత్నాకర్ ఫిర్యాదు ఆధారంగా మల్లారెడ్డి తదితరులపై బోయిన్పల్లి పోలీసులు ఐపీసీ 342, 353, 201, 504, 506, 379 రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ రెండు ఘటనలు మల్లారెడ్డి ఆసుపత్రిలోనే ఉదంతాలు చోటు చేసుకున్నాయి. ఇది దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. దీంతో మొదట కేసు నమోదు చేసుకున్న అధికారులు ఆతరువాత దర్యాప్తు నిమిత్తం కేసులను ఆ ఠాణాకు బదిలీ చేశారు.

విచిత్రంగా...
ఈ రెండు కేసులు నమోదైన కాసేపటికి బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ వద్ద నాటకీయంగా ఓ ల్యాప్ టాప్ ప్రత్యక్షమైంది. రత్నాకర్ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టారు. రత్నాకర్ ల్యాప్టాప్, ఇతర వస్తువులు మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఉన్నాయా? వాటిని ఎవరైనా తమతో తీసుకు వెళ్లారా? లాంటి అంశాలను ఆరా తీశారు. ఈ క్రమంలోనే గురువారం తెల్లవారుజామున 4.15 గంటల సమయంలో అనుకోని ఘటన జరిగింది. బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ గేట్ దగ్గర ఓ ల్యాప్ టాప్  ప్రహరీని ఆనుకుని ఉండటం పోలీస్ కానిస్టేబుళ్ల కంటపడింది. దీంతో వారు ఆ ల్యాప్ టాప్ ను రత్నాకర్ కు చూపించారు. అయితే, అది తనది కాదని, ఎవరో దాన్ని మార్చేశారని రత్నాకర్ అన్నారు. దీంతో లాప్ టాప్ కు పంచనామా నిర్వహించిన పోలీసు సిబ్బంది.. దాన్ని దుండిగల్ పోలీసులకు అప్పగించాలని నిర్ణయించారు.

Follow Us:
Download App:
  • android
  • ios