రాజీనామాపై తొలిసారి నోరు విప్పిన గుత్తా
- నా రాజీనామాపై సిఎం దే నిర్ణయం
- నా వారసుడి పోటీ పైనా సిఎం దే నిర్ణయం
- ఎవరు పోటీ చేస్తారన్నదానిపైనా సిఎం దే నిర్ణయం
- రాజీనామా వార్తలు ఖండించను, సమర్థించను
తాను రాజీనామా చేస్తానని వస్తున్న వార్తలపై తొలిసారిగా నల్లగొండ ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డి నోరు విప్పారు. రాజీనామా విషయంలో వార్తలు గుప్పుమంటున్న నేపథ్యంలో ఆయన మరోసారి ఎటూ తేల్చకుండా మాట్లాడారు. అయితే బంతిని సిఎం కోర్టులోకి నెట్టేశారు గుత్తా.
సచివాలయంలో శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమానికి గుత్తా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో ముచ్చటించారు తన రాజీనామాపై కాలమే నిర్ణయిస్తుందని వివరించారు. తన వారసుడు వస్తారా లేదా అన్నది తన చేతిలో లేదని సిఎం చేతిలోనే ఉందని స్పష్టం చేశారు. ఎవరు పోటీ చేస్తారన్నది కూడా సిఎం నిర్ణయిస్తారని చెప్పారు. రాజీనామా వార్తలను సమర్థించబోనని, అలాగే వ్యతిరేకించబోనంటూ మాట్లాడారు గుత్తా.
రైతు కుటుంబంలో పుట్టిన తాను రైతుగానే ఉన్నానని చెప్పారు. 14 ఏళ్లుగా ఎంపిగా కొనసాగుతున్నానని ఒకవేళ ఎంపి పదవికి రాజీనామా చేసి రైతుగానే ఉండాలన్నా ఉంటానంటూ చెప్పారు. తన రాజీనామాపై సిఎం కేసిఆర్ దే తుది నిర్ణయం అని గుత్తా స్పష్టం చేశారు.
ఆర్ఎస్ఎస్ (రైతు సమన్వయ సమితి) విషయంలో ఇంకా తుదిరూపు తీసుకోలేదన్నారు. సిఎం మూడు ప్రత్యామ్నాయాలు పరిశీలిస్తున్నారని వాటిలో ఏదో ఒకటి ఫైనల్ చేసే అవకాశం ఉందన్నారు.
అందులో ఒకటి గతంలో ఉన్న కర్షక పరిషత్ ను మళ్లీ ఏర్పాటు చేసే ప్రతిపాదన అని చెప్పారు. అయితే గతంలో కర్షక పరిషత్ ను కోర్టు కొట్టేసిన తరుణంలో మళ్లీ న్యాయపరమైన చిక్కులు లేకుండా కర్షక పరిషత్ ఎలా తీసుకురావాలన్నదానిపై సిఎం చర్చిస్తున్నారని తెలిపారు. సిఎం ఉన్నారు.
అలాగే రైతు సమన్వయ సమితి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే ఏరకమైన పరిణామాలుంటాయన్నదానిపైనా చర్చిస్తున్నారని చెప్పారు.
మూడో ప్రతిపాదనగా రైతు సమన్వయ సమితి సొసైటీ కింద ఫామ్ చేస్తే ఎలా ఉంటుంది అన్నదానిపైనా చర్చిస్తున్నారని త్వరలోనే దీనిపై క్లారిటీ వస్తదని చెప్పారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి