ప్రజల ఇంటి వద్దకే రవాణా శాఖ: మంత్రి పువ్వాడ సరికొత్త ప్రయోగం
రవాణా శాఖలో కొత్త ప్రయోగాలకు తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శ్రీకారం చుట్టారు
రవాణా శాఖలో కొత్త ప్రయోగాలకు తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శ్రీకారం చుట్టారు. శుక్రవారం రాష్ట్ర పురపాలక శాఖ, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఐదు సేవలు ఆన్లైన్ ద్వారా పొందే వెసులుబాటును కల్పించారు.
పూర్తి సాంకేతిక పరిజ్ఞానంతో ఐటీ శాఖ సమన్వయంతో 1)డూప్లికేట్ LLR పొందుట, 2) డూప్లికేట్ లైసెన్స్ పొందుట 3) బ్యాడ్జి మంజూరు 4) స్మార్ట్ కార్డ్ పొందుట(పాత లైసెన్స్ సమర్పించి కొత్తది పొందుట) 5) లైసెన్స్ హిస్టరీ షీట్ పొందుట సేవలను మంత్రి ప్రారంభించారు.
Also Read:బాల్యం నుంచి లీడర్ దాకా: కేటీఆర్ బర్త్డేకి అరుదైన కానుక
ఆయా సేవలు ఇక నుండి పూర్తిగా ఆన్లైన్లోనే పొందవచ్చునని అజయ్ పేర్కొన్నారు. అక్రమాలకు అడ్డుకట్ట వేసి పారదర్శక పాలన అందించేందుకు ఇప్పటికే ఆధార్ను తప్పనిసరి చేశామని ఆయన చెప్పారు.
వాహనాల రిజిస్ట్రేషన్ల కోసం రవాణా శాఖ కార్యాలయాల చుట్టూ పదే పదే తిరగనవసరం లేదని, దళారులను ఆశ్రయించాల్సిన అవసరం ఉండదని మంత్రి స్పష్టం చేశారు. ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు అందించేందుకు గాను చర్యలు తీసుకుంటామని అజయ్ తెలిపారు.
Also Read:కేసీఆర్ సెంటిమెంటు, నూతన సచివాలయం అంతా "6"మయం
దరఖాస్తుదారుడు ఇంట్లోనే కంప్యూటర్ ముందు కూర్చొని వాహన్ వెబ్సైట్ ఓపెన్ చేసి తనకు కావలసిన సేవలను దరఖాస్తు చేసుకోవచ్చునని అజయ్ కుమార్ వెల్లడించారు. దరఖాస్తుదారుడు తన వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేయించాలంటే దానికి సంబంధించిన అన్ని పత్రాలను ఆన్లైన్లో పంపాల్సి వుంటుందని మంత్రి తెలిపారు.