కరోనా కరుణించినా కాటేసిన బ్లాక్ ఫంగస్... మేడిపల్లి ఎమ్మార్వో మృతి
తెలంగాణలో కరోనా కేసులు,మరణాలు కాాస్త తగ్గాయని అందరూ కాస్త ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో బ్లాక్ ఫంగన్ కలవరం రేపుతోంది.
జగిత్యాల: తెలంగాణలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టినవేళ బ్లాక్ ఫంగస్ విజృంభణ మొదలయ్యింది. ఇప్పటికే ఈ ఫంగస్ కేసుల సంఖ్య పెరుగుదలే ఆందోళన ఆందోళన కలిగిస్తుంటే తాజాగా మరణాల సంఖ్య కూడా పెరిగాయి. తాజాగా కరోనా నుండి కోలుకున్నా బ్లాక్ ఫంగస్ బారినపడి ఓ తహశీల్దార్ మృత్యువాతపడ్డ విషాద సంఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే... జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల రెవెన్యూ అధికారి(ఎమ్మార్వో) అనుమల్ల రాజేశ్వర్(54) ఇటీవల గత నెల(ఏప్రిల్)లో కరోనా బారినపడ్డాడు. కరోనా లక్షణాలతో బాధపడుతున్న అతడు టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ గా తేలడంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందారు.
read more జీహెచ్ఎంసీలో కరోనా జోరు: తెలంగాణలో కోవిడ్ కేసులు 5,56,320కి చేరిక
అయితే కరోనా నుండి సురక్షితంగా బయటపడ్డ అతడిని బ్లాక్ ఫంగస్ అటాక్ చేసింది. దీంతో అతడికి అదే ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స అందించారు. ఇతడి చికిత్స సమయంలో మందుల కొరత ఏర్పడటంతో స్వయంగా జగిత్యాల కలెక్టర్ చొరవచూపి మందులు అందేలా చూశారు. అయినప్పటికి లాభం లేకుండా పోయింది. బ్లాక్ ఫంగస్ తో ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో రాజేశ్వర్ సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచాడు.
ఇంటిపెద్దను ఇలా బ్లాక్ ఫంగస్ బలితీసుకోవడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. కరోనా కరుణించినా ఫంగస్ కాటేయడంతో ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబసభ్యులు బోరున విలపిస్తున్నారు. అలాగే మేడిపల్లి ఎమ్మార్వో కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు కూడా రాజేశ్వర్ మృతిపట్ల తీవ్ర ఆవేధన వ్యక్తం చేశారు.