మహేష్ కత్తిని కర్ణాటకకు తరలించిన పోలీసులు: ఎందుకంటే...
సినీ క్రిటిక్ మహేష్ కత్తిని చిత్తూరు జిల్లాలోని ఆయన స్వగ్రామానికి తరలించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆయనను పోలీసులు కర్ణాటకకు తరలించారు.
హైదరాబాద్: సినీ క్రిటిక్ మహేష్ కత్తిని చిత్తూరు జిల్లాలోని ఆయన స్వగ్రామానికి తరలించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆయనను పోలీసులు కర్ణాటకకు తరలించారు. హైదరాబాదు నుంచి బహిష్కరణకు గురైన ఆయనను చిత్తూరుకు తీసుకుని వెళ్లేందుకు ప్రయత్నించారు.
అయితే, భద్రతా కారణాల వల్ల ఆయనను కర్ణాటకకు తరలించారు. తాను క్షేమంగానే ఉన్నానని, ఆందోళన చెందాల్సిన అవసరంలేదని మహేష్ కత్తి ఫేస్ బుక్ పోస్టు ద్వారా తెలియజేశారు. 14 ఏళ్లుగా ఈ చట్టాన్ని ఉపయోగించలేదని, తాజాగా తనపై ఉపయోగించారని అన్నారు..
సాధారణంగా రౌడీలపై, సంఘ విద్రోహశక్తులపై దీన్ని ప్రయోగిస్తుంటారని, అయితే తనపై ఎందుకు విధించారో అర్థం కావడం లేదని మహేష్ కత్తి అన్నారు. తాను అన్న రెండు మాటలు మొత్తం హైదరాబాద్ను ఎలా భయాందోళనలకు గురి చేశాయో తనకు అర్థం కావడం లేదని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
అప్పట్లో పల్లెల నుంచి వెలేసేవారని, ఇప్పుడు నగరాల నుంచి వెలేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.. తనపై చేసిన ఆరోపణలన్నీ నిరాధారమని ఆయన అన్నారు. తాను చట్టపరంగా వెళతానని చెప్పారు. తన జీవితం, జీవిక హైదరాబాద్ మీద ఆధారపడి ఉన్నాయని, హైదరాబాద్ రాకుండా చేయడం అనేది అసంబద్ధంగా ఉందని అన్నారు.
గౌరవప్రదంగా తాను హైదరాబాద్కు వస్తానని అన్నారు. ఫేస్బుక్ లైవ్లో మాట్లాడిన కత్తి పలువురు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.